ఏపీ ఎన్నికలు: పొత్తులపై పవన్ కళ్యాణ్ తొలి అడుగు, వారికి ఇచ్చే సీట్లపై డైలమా!
అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, లెఫ్ట్ పార్టీల పొత్తుకు తొలి అడుగు పడింది. మంగళవారం నాడు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి వామపక్ష నేతలు వచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు జనసేనాని పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో చర్చలు జరిపారు.
అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?
ఈ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న లెఫ్ట్
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా పొత్తులు, సీట్లు ఖరారు చేసుకుందామని నాదెండ్ల వారితో చెప్పారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తమకు పట్టు ఉన్న స్థానాల జాబితాను జనసేనాని పవన్ కళ్యాణ్కు వామపక్ష నేతలు అందించారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వారు ఎక్కువ స్థానాలను ఆశిస్తున్నారు.
సంక్రాంతి తర్వాత మరోసారి భేటీ
పవన్ కళ్యాణ్తో చర్చలు ముగిసిన అనంతరం లెఫ్ట్ పార్టీ నేతలు రామకృష్ణ, మధులు మాట్లాడారు. పొత్తులపై ఆయనతో చర్చించామని తెలిపారు. సీట్ల కేటాయింపు పైన కూడా చర్చ జరిగిందని చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత మరోసారి భేటీ అవుతామని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఎలా ఎదుర్కోవాలనే అంశం పైనా చర్చించినట్లు చెప్పారు.
తొలుత నాదెండ్లతో గంటపాటు భేటీ
వచ్చే ఎన్నికల్లో తాము అధికార (టీడీపీ), ప్రతిపక్ష (వైసీపీ)లతో కలిసి వెళ్లేది లేదని, వామపక్షాలతో కలిసి నడుస్తామని జనసేనాని ఇదివరకే చెప్పారు. దానికి అనుగుణంగా మంగళవారం నాడు చర్చలు ప్రారంభమయ్యాయి. వామపక్ష నేతలు తొలుత నాదెండ్ల మనోహర్తో గంటపాటు భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆ తర్వాత వారు పక్కనే ఉన్న జనసేనాని నివాసానికి వారిని నాదెండ్ల తీసుకు వెళ్లారు. వారు జనసేనానితో సమావేశమయ్యారు.
ఎలా ఎదుర్కోవాలనే కసరత్తు
రానున్న ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుతో పాటు వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఎలా ఎదుర్కోనేందుకు ఏం చేయాలని, ఏం కసరత్తు చేయాలనే అంశాలపై కూడా వారు చర్చించారని తెలుస్తోంది. వామపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారని తెలుస్తోంది. వారికి ఎన్ని స్థానాల్లో పట్టు ఉంది, ఏ స్థానాలు కేటాయించాలని ఆయన ఆరా తీయగా, వామపక్ష నేతలు ఇందుకు సంబంధించిన జాబితాను అప్పగించారని తెలుస్తోంది.
రెండో భేటీలో సీట్ల పై చర్చ
సంక్రాంతి తర్వాత జరిగే వరుస భేటీల్లో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తొలి భేటీ జరిగింది. రెండోసారి భేటీలో మాత్రం వామపక్షాలకు ఎన్ని సీట్లు, ఏయే స్థానాలు కేటాయించాలనే అంశంపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నందున త్వరగా సర్దుబాటు చేసుకోవాలని ఇరువర్గాలు భావిస్తున్నాయి.