'ఫైవ్ ఇయర్ ప్లాన్', టీడీపీతో దూసుకెళ్లింది: పవన్ కళ్యాణ్ 2014 వ్యూహం సక్సెస్
అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు రాని వారు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే సమయంలో టీడీపీ, వైసీపీలు టిక్కెట్లు ఇచ్చేకే జనసేన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా పార్టీల్లో టిక్కెట్లు రాని అభ్యర్థులు తమ వైపు వస్తారని జనసేన భావిస్తోందని తెలుస్తోంది. 2014లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. గత కొంతకాలంగా చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ తర్వాత వైసీపీ అధినేత వైయస్ జగన్నూ టార్గెట్ చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని నిలదీస్తున్నారు. ఇటీవల మాటల దాడిని పెంచుతున్నారు.
కుక్కను నిలబెట్టినా అన్నారు కానీ: ఎన్టీఆర్పై పవన్ కళ్యాణ్, జగన్ సీఎం కాబోతున్నారని చెప్పారు!
ఆసక్తికర వ్యాఖ్యలు
2019 అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రత్యర్థులను టార్గెట్ చేయడం, కమిటీల ఏర్పాటు... వీటన్నింటి విషయంలోను గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా, గురువారం కడప, గుంటూరు జిల్లాల నేతల సమక్షంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2014లో చేసింది ప్రయోగమే
2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి ఒక ప్రయోగం చేశానని, ఆ ప్రయోగం విజయవంతం కావడం వల్లే జనసేన బలంగా దూసుకుపోయిందని, ఎదుటి వారిని బలంగా ప్రశ్నించాలంటే నైతిక బలం కావాలని, అందుకే అప్పుడు టీడీపీ, బీజేపీలకు అండగా నిలిచానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుందని, ఏపీ అభివృద్ధి చెందాలన్నా, అమరావతి ముందుకు వెళ్లాలన్నా జనసేన పార్టీ అవసరం అన్నారు.
ఎలాగు గెలిచే పరిస్థితుల్లేవు
ఆయన వ్యాఖ్యలను బట్టి 2014లో టీడీపీతో పొత్తు వ్యూహాత్మకంగానే పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే ఎలాగూ గెలిచే పరిస్థితులు లేవని, కాబట్టి టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చారు. ఆ తర్వాత ఏ పార్టీ గెలుపు కోసమైతే కృషి చేశారో, అదే పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యూహాత్మకంగా దాదాపు నాలుగేళ్ల పాటు మైత్రి నెలకొల్పారు. ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీకి షాకిస్తూ విరుచుకుపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యూహమేనా?
2014లో టీడీపీకి మద్దతిచ్చి, ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఆ ప్రభుత్వం పాలనను తరిచి చూసి, అనంతరం విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు జనసేనాని. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలను తరిచి చూస్తే ఎన్నికల ముందు అందర్నీ తన వైపుకు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే పక్కా ప్లాన్తో ఇలా చేసి ఉంటారా అనే చర్చ సాగుతోంది. 2014లో టీడీపీకి మద్దతివ్వకుండా ఒంటరిగా పోటీ చేసినా లేక పోటీకి దూరంగా ఉండి ఇప్పుడు పోటీ చేసినా జనసేనపై ఇంతగా అటెన్షన్ ఉండకపోయి ఉండునా అనే చర్చ సాగుతోంది. ఏదేమైనా టీడీపీకి మద్దతిచ్చి, ఆ తర్వాత ఎదురు తిరగడంతో అటెన్షన్ మరింత పెరిగిందని జనసేనాని వ్యాఖ్యల ద్వారానే అర్థమవుతోందని అంటున్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇది 'అయిదేళ్ల ప్లాన్'గా అభిప్రాయపడుతున్నారు.