వివాదాస్పదంగా ఏపీ పోలీసుల తీరు-ఇప్పటికే టీడీపీ ఫిర్యాదు- అదేబాటలో పవన్ కళ్యాణ్
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్షాలపై దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల సాయంతో అధికార పార్టీ ఎక్కడికక్కడ తమను అణచివేస్తున్న తీరుపై విపక్షాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి దాడికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయనకు సహకరించారని భావిస్తున్న పోలీసులపై కేంద్ర హోంశాఖకు ఎంపీ కనకడమేడల ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల వ్యవహారశైలిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హోంశాఖకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీలో పోలీసుల తీరుపై చర్చ
ఏపీలో పోలీసుల దాడులు పెరుగుతున్నాయి. విపక్షాల్ని టార్గెట్ చేస్తూ పలు చోట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ లోని పెద్దలు, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు చెప్పినట్లు ఆడుతున్న పోలీసులు విపక్షాలను టార్గెట్ చేస్తుండటంతో వారి వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలోనూ పోలీసులు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం సహజమే అయినా ఈ స్ధాయిలో విపక్షాల్ని టార్గెట్ చేయడం మాత్రం చర్చనీయాంశమవుతోంది.
విపక్ష నేతలపై వేధింపులు
ముఖ్యంగా విపక్ష నేతల్ని అణగదొక్కాలన్న వైసీపీ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పోలీసులు వాళ్లను క్షేత్రస్ధాయిలో ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలే బాస్ లు అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విపక్షాల్లో ఆందోళన, ఆక్రోశం పెరుగుతోంది. దీంతో పోలీసుల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో అధికార పార్టీ మాట విని కేసులు పెట్టడం, వేధించడం చేసే వారని, కానీ ఇప్పుడు ఏడాది పొడవునా ఏదో ఒక విషయంలో పోలీసులు తమను టార్గెట్ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో విపక్ష నేతలపై పోలీసులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి.
చంద్రబాబు ఇంటి ఘటనలో
తాజాగా చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ నిరసన పేరుతో కర్రలు, జెండాలతో వస్తే ఆ సమాచారం తమకు లేదంటూ పోలీసులు చెప్పడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో టీడీపీ నేతలే జోగి రమేష్ పై దాడి చేశారంటూ గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లి నిరసన తెలుపుతానంటూ ముందురోజే జోగి రమేష్ ప్రకటించినా పోలీసులు అడ్డుకోలేకపోగా.. తమకు సమాచారం లేదని చెప్పడమేంటన్న చర్చ జరుగుతోంది.. అలాగే ఈ ఘటన జరిగిన తర్వాత టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టిన పోలీసులు.. అక్కడికి ముందుగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఇతర నేతలపై నామమాత్రపు కేసులు కూడా పెట్టకపోవడం కూడా వివాదాస్పదమవుతోంది. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
కడియంలో జనసేన నేతలపైనా..
తూర్పుగోదావరి జిల్లా కడియంలో తాజాగా వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో జనసేన విజయం సాధించింది. వైసీపీ, టీడీపీ కంటే ఎక్కువ సీట్లు సాధించిన జనసేన.... అక్కడ ఎంపీపీ స్ధానాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. దీంతో కడియం మండలం పొట్టిలంక ఎంపీటీసీగా గెలుపొందిన జనసేన సభ్యుడికి దండ వేయడానికి వెళ్లిన కామారెడ్డి సతీష్ అనే కార్యకర్తను పోలీసులు దారుణంగా కొట్టడం వివాదాస్పదమవుతోంది. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కడియంలో జనసేన ఎంపీపీ స్ధానం దక్కంచుకోవడం ఖాయమైందని, అందుకు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా పోలీసులు ఏదైనా చేస్తే తానే రంగంలోకి దిగాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు.
కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటూ పవన్ వార్నింగ్
తూర్పుగోదావరి జిల్లా కడియం ఎంపీపీ స్ధానాన్ని జనసేన దక్కించుకోవడం ఖాయం కావడంతో అక్కడ వైసీపీ నేతలకు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్న పవన్ కళ్యాణ్.. ఇక తానే రంగంలోకి దిగుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు పోలీసుల తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా చేస్తానన్నారు. ఏపీ పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. దీంతో ఇక్కడా పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. విపక్షాల్ని టార్గెట్ చేస్తున్న పోలీసుల తీరుపై కేంద్రానికి వరుస ఫిర్యాదులు అందుతుండటం చర్చకు తావిస్తోంది. అయితే వైసీపీ మాత్రం ఇదంతా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
Recommended Video
కేంద్రం రియాక్ట్ అయితే ?
ఏపీలో అధికార పార్టీ కన్నుసన్నల్లో పోలీసులు విపక్ష పార్టీల్ని టార్గెట్ చేస్తున్న వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతోపాటు తాజాగా చంద్రబాబు ఇంటిపైకి నేరుగా వైసీపీ ఎమ్మెల్యే దాడికి వెళ్లడం, అందుకు పోలీసులు కూడా సహకరించారన్న ఫిర్యాదులతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై త్వరలో నోటీసులు జారీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జనసేన అధినేత, బీజేపీ మిత్రపక్ష నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా హోంశాఖకు ఫిర్యాదు చేస్తే పరిస్ధితి మరింత తీవ్రం కావడం ఖాయంగా కనిపిస్తోంది అదే జరిగితే ఈ రెండు అంశాలపై హోంశాఖ తీసుకోబోయే చర్యలపైనా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వైసీపీ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు మద్దతుగా ఉన్నప్పటికీ రఘురామరాజుతో పాటు మరికొన్ని అంశాల్లో మాత్రం ఆ పార్టీకి ఆశించిన మద్దతు లభించడం లేదు. దీంతో విపక్షాల ఫిర్యాదులపై హోంశాఖ ఏం నిర్ణయం తీసుకున్నా అది సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.