పవన్ కళ్యాణ్ను నమ్మట్లేదు: మంత్రి, బిర్లా వల్లే సాధ్యం కాదు: జయదేవ్పై అరుణ
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఏమాత్రం అనుభవం లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసే వ్యక్తి అని ఆరోపించారు.
దాడి వీరభద్ర రావు ఇంటికి పవన్ కళ్యాణ్
జగన్, పవన్ కళ్యాణ్లను ప్రజలు నమ్మే ప్రసక్తి లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోను టీడీపీనే గెలుస్తుందని, ప్రజలు తమ పార్టీకి పట్టం కడతారని జోస్యం చెప్పారు.
బీజేపీ చేసిందేమీ లేదు
విభజనతో ఇబ్బందులు పడుతున్న నవ్యాంధ్ర ప్రదేశ్కు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేసింది ఏమీ లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. బీజేపీకి ప్రజలు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధం
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. సంక్షేమ పథకాలే తమను మళ్లీ గెలిపిస్తాయని చెప్పారు. ప్రతిపక్షం లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు.
గల్లా జయదేవ్పై దుష్ప్రచారం
గల్లా జయదేవ్ వస్తే ఇంటికి ఓ ఉద్యోగం వస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత గల్లా అరుణ కుమారి మంగళవారం అన్నారు.
అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణకు ఎంపికైన యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గల్లా అరుణ, ఆమె తనయుడు, ఎంపీ గల్లా జయదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జయదేవ్ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని దుష్ప్రచారం చేశారని, ఇంటికో ఉద్యోగం ఇవ్వడం బిర్లాల వల్ల కూడా సాధ్యం కాదన్నారు.
అమరావతిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
భూములు ధరలు పెరగడంతో రాజధాని అమరావతి ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడలేదని గల్లా అరుణ అన్నారు. గల్లా జయదేవ్ మాట్లాడుతూ కష్టపడకుండా ఏది సాధ్యం కాదన్నారు. కష్టం, క్రమశిక్షణ మనలను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందన్నారు. త్వరలో అమరావతిలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.