నాదెండ్లను పక్కన పెట్టుకొని మాట్లాడుతావా, చిరంజీవి-లోకేష్ సరే కానీ: పవన్పై బుద్ధా
విజయవాడ: తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న ఆదివారం అన్నారు. 2019లో జాతీయ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పారు.
నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో అర్థమైందా: బాబు, కాంగ్రెస్తో దోస్తీ, కేసీఆర్ పాలనపై కీలక వ్యాఖ్యలు
మోడీ, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కలిసి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రం కోసమే కాంగ్రెస్తో పొత్తు, నాదెండ్లను పక్కన పెట్టుకొని అంటావా
ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరుగుతున్న కుట్రా రాజకీయాలను ప్రజలు గమనించాలని బుద్ధా వెంకన్న అన్నారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యామని చెప్పారు. విభజన సమయంలో అసెంబ్లీలో సభాపతిగా ఉన్న నాదెండ్ల మనోహర్ను పక్కన పెట్టుకొని జనసేనాని తమపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
అన్నయ్య చిరంజీవిని ఎదిరించావు సరే
తన అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తాను 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చానని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నారని, అన్నయ్య చిరంజీవిని ఎదిరించానని మాటిమాటికి చెబుతున్నారని, మరి ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ప్రధానిని నిలదీయాలన్నారు.
లోకేష్ సరే.. పవన్ సీఎం ఎలా అవుతారు
మోడీ ఏపీకి చేసిన అన్యాయాన్ని ఎదుర్కొని నిలిచిన నేత చంద్రబాబు అని బుద్ధా అన్నారు. మోడీని ప్రశ్నించే ధైర్యం మాత్రం జనసేనానికి లేదని చెప్పారు. కానీ చంద్రబాబును మాత్రం పదేపదే టార్గెట్ చేసుకోవడం విడ్డూరమన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే నారా లోకేష్ మంత్రి అయ్యారని చెబుతున్నారని, మరి ఇప్పటి వరకు అసలు పోటీయే చేయని పవన్ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ఎద్దేవా చేశారు.
జనసేన కార్యకర్తలను ఆదుకున్న టీడీపీ
ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ చొరవ కారణంగా రాష్ట్రమంతా పల్లెల్లో సీసీ రోడ్లు ఏర్పాటు అయ్యాని చెప్పారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి పేరుతో లోకేష్ ఆదుకుంటున్నారని, చివరకు జనసేన కార్యకర్తలను సైతం చంద్రన్న బీమా కింద ఆదుకున్న ఘనత టీడీపీదే అన్నారు. ఇప్పటికైనా పవన్ అనవసర విమర్శలు మానుకోవాలన్నారు.