జగన్ గారూ! సీమ నుంచి వచ్చి చరిత్ర మరిచారా? తెలంగాణ విడిపోయింది అందుకే: పవన్ కళ్యాణ్
అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీషు మాధ్యామాన్ని ప్రవేశపెట్టడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వరుస ట్వీట్లతో ఏపీ సర్కారుపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.
అప్పుడేమో అలా..
గత ప్రభుత్వం ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్రిక తీవ్రంగా వ్యతిరేకించిందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే ఇలానా?
‘దేశ భాషలందు తెలుగు లెస్స, మాతృభాష మన ప్రాచీన సంపద. కాపాడుకుందాం, పెంపొందిద్దాం. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు' అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన ట్వీట్ను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే తమ ఆలోచన మారిపోయిందా? అంటూ పవన్ ప్రశ్నించారు.
జగన్ గారూ చరిత్ర మరిచారా?
‘6 వ శతాబ్దంలో ఏడూ వేల గ్రామాల మండలమైన రేనాడు(ఇప్పటి రాయలసీమ) లోనే తెలుగు లిపిలో ఉన్న మొట్టమొదటి శాసనాలన్నీ దొరికినయి. పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం అప్పటి రేనాడు (ఇప్పటి రాయలసీమలోనే)గ్రామాలే... రాయలసీమ నుంచి వచ్చిన వైసీపీ నేతలే దీన్ని మర్చిపోవడం విచారకరం' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మేధావులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, ఆ నిర్ణయం భవిష్యత్ తరాల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
అందుకే తెలంగాణ..
‘యాసని, సంస్కృతిని అవమానపరిచారు అంటేనే -తెలంగాణ విడిపోయింది,;మరి మాతృ భాషని అగౌరపరిచి , ఉనికిని చంపేస్తానంటే ఏం జరుగుతుందో నాయకులూ ఊహించగలరా???' అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
మనం చిన్నపరుచుకుంటే ఎలా?
‘మన భాషని, మన సంస్కృతిని మనం చిన్నపరుచుకుంటే ఎలా?? ఇంగ్లీష్ నేర్పాలి కానీ ,విద్యావిధానంలో మాతృభాష ని అగౌరపరిచే పద్ధతి మానుకోవాలి' అని ఏపీ సర్కారుకు పవన్ కళ్యాణ్ హితవు పలికారు.