రాష్ట్ర విభజన అందుకే, ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది: పవన్ కళ్యాణ్
అమరావతి: ఏపీ రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆదివారం ఉదయం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గతంలో రాజధాని కోసం 3 వేల ఎకరాలు అన్న టీడీపీ తరవాత 30 వేల ఎకరాలు, 40 వేల ఎకరాలు అంటూ పెంచుకొంటూ పోయిందన్నారు.
Recommended Video
ప్రధానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన: అట్టుడుకుతున్న రాజధాని: రోజురోజుకూ ఆందోళన బలోపేతం
రాజధాని రైతులను మోసం చేశారు..
టీడీపీ గతంలో రాజధాని భూ సమీకరణ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకొంది. అందుకు అంగీకరించనివారిపైనా, అసైన్డ్ భూములున్నవారిపైనా బలవంతంగా భూ సేకరణ చట్టం ప్రయోగించబోయింది. 2015లో పెనుమాక, బేతపూడి, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల రైతులు ఈ బాధను, ఆందోళనను నా దృష్టికి తెచ్చారు. ఆ గ్రామాలకు వెళ్ళి రైతులకు అండగా నిలిచాను. ఇష్టపడి ఇస్తే తీసుకోండి, బలవంతంగా తీసుకోవద్దు అన్నాను. అప్పుడే అడిగాను.. ఇన్ని వేల ఎకరాలు తీసుకొంటున్నారు, ప్రభుత్వం మారితే ఇక్కడి రైతులకు భరోసా ఏమిటి అని ప్రశ్నించాను. తొలి నుంచి ఇప్పటి వరకూ జనసేన చెబుతున్నది ఒకటే మాట.. రైతు కన్నీరుపై రాజధాని నిర్మించవద్దు అని. తెలుగుదేశం, వైసీపీలు రెండూ ఒకటే. రాజధానికి సమీకరణ చేస్తున్న సమయంలో వీళ్ళు ఒకే విధంగా వ్యవహరించారు. చిన్న రైతుల్లో కూడా పెద్ద ఆశలు కల్పించారు. రెండు సెంట్లు, మూడు సెంట్లు ఉంటే కూరగాయలో, పూలో పండించుకొని బతికే చిన్నపాటి రైతులు కూడా రాజధానికి భూములు ఇచ్చారు. ఈ రెండు పార్టీలు రాజధానికి అనుకూలంగా ఉన్నాయనుకోవడం వల్లే భూములు ఇచ్చారు. ఇప్పుడు రైతుల జీవితాలను ఛిద్రం చేశారు. రాజధాని రైతుల ఆవేదనకు, అమరావతి నుంచి రాజధాని తరలిపోవడానికి ఆ రెండు పార్టీలు సంజాయిషీ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన తెలంగాణలో భూముల వ్యవహారం వల్లే.. ఇప్పుడు ఏపీలో..
ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఏర్పాటైన ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ చుట్టూ సాగించిన భూ వ్యవహారాలు, లావాదేవీల వల్లే తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఆవేదన గూడుకట్టుకొంది. రింగ్ రోడ్లు, ఎస్ఈజెడ్ లు అంటూ భూములు తీసుకొని కొందరికే ఇవ్వడంతో పేద ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. అది రాష్ట్ర విభజనకు దారి తీసింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య చిచ్చు రేపేలా వైసీపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని తీసుకువచ్చింది. ఈ మూడు ప్రాంతాల ప్రజల మధ్య ఎప్పుడూ సఖ్యత ఉంది. ఆ సుహృద్భావ వాతావరణాన్ని రాజధానుల పేరుతో పాడు చేయవద్దు. ప్రాంతీయ విభేదాలతో మరోసారి విడిపోయే స్థితి తీసుకురాకుండా చూడాలి. రాజధాని వికేంద్రీకరణ అంశంపై జనసేన పార్టీ న్యాయకోవిదులతో, నిపుణులతో కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్తుందని పవన్ చెప్పారు.
జగన్ ప్రభుత్వమే ప్రజలను మోసగిస్తోంది: నాదెండ్ల మనోహర్
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. "రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రక్రియ ప్రకారం చేసినది కాదు. వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమే ఇది. ఒక వ్యక్తి ఆలోచనల మేరకు... వ్యక్తిగత శతృత్వం, వ్యక్తిగత విభేదాలతో అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో మంత్రులకు కూడా రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తెలియవు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలకైతే ఏం జరుగుతుందో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు వాణిజ్య దృక్పథంతో రాజధాని నిర్మాణం విషయంలో కాలయాపన చేశారు. రాజధానికి సంబంధించి బలమైన చట్టం తీసుకువచ్చే విషయంలో శ్రద్ధపెట్టలేదు. ఆ అలసత్వం ఫలితంగానే ఇక్కడి నుంచి రాజధానిని వికేంద్రీకరిస్తున్నారు. ఆ అయిదేళ్లు చంద్రబాబు బీద ఏడుపులు ఏడుస్తూ దీక్షలు చేశారు తప్ప రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై ప్రణాళికాబద్ధంగా వెళ్లలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రాజధాని వికేంద్రీకరణ అంటూ కాలం దొర్లిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో తప్పటడుగులు వేసి రాజధాని రైతులను నష్టపరచింది. ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుంది అనే ఉద్దేశంతోనే భూములను రైతులు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారు. ఒప్పందం ఉల్లంఘించి ప్రభుత్వమే ప్రజలను మోసం చేయడం ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలోనే జరుగుతోందని మండిపడ్డారు. .
చంద్రబాబు చేసిన తప్పిదాలే.. జగన్కు అనుకూలంగా: నాగబాబు
జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ఇంచార్జ్, పీఏసీ సభ్యులు నాగబాబు మాట్లాడుతూ.. "రాజధాని విషయంలో తొలి నుంచి ఒకే విధానం, ఒకే మాట మీద ఉన్నది జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మాత్రమే. అన్ని వేల ఎకరాల భూమిని సమీకరిస్తే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే రైతులకు ఎవరు భరోసాగా ఉంటారు అని 2015లోనే బలంగా మాట్లాడారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు రాజధాని తీసుకువెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. ప్రభుత్వమే మోసం చేస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు. నాడు ఆయన చేసిన తప్పిదాలనే నేడు జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకొని వెళ్తున్నారు. విశాఖలో రాజధాని పెట్టడం అనేది పక్కా వ్యూహం ప్రకారం జరుగుతున్న కార్యక్రమం.
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. రైతులు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఒకటి, రెండు రోజుల్లో తేలే అంశం కాదు. సుదీర్ఘ పోరాటానికి మానసికంగా సిద్ధమై ఉండాలి. 100 శాతం రాజధాని ప్రాంత వాసులకు అన్యాయం జరిగిందన్నారు.