జగన్! హైకోర్టు కళ్లుగప్పడానికా? ఉద్యోగులను బలిచేస్తారా?: జీవో నెం. 13పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జీవో జారీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి జీవోలు జారీ చేస్తూ అధికారులు, ఉద్యోగులు బలి చేస్తారా? అని నిలదీశారు.
Recommended Video
హైకోర్టు కళ్లుగప్పడానికా?
అమరావతి నుంచి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, రాష్ట్ర విజిలెన్సు కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జీవో నెం.13ను అర్ధరాత్రి వేళ జారీచేయడం తనను నమ్మి 151 అసెంబ్లీ స్థానాలలో గెలిపించిన ప్రజలను మోసంచేయడానికా? అని ప్రశ్నించారు. లేదంటే రాజధాని తరలింపుపై కేసులు విచారణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హై కోర్టు కళ్లుగప్పడానికా? అని నిలదీశారు.
చివరికి ఉద్యోగులే బలి..
ఇటువంటి చర్యలవల్ల బలైపోయేది చివరికి దానిపై సంతకాలు చేసే ఉద్యోగులు, అధికారులేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సచివాలయం ఆధ్వర్యంలో పనిచేయవలసిన రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్కార్యాలయాన్ని కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో అందులో పనిచేసేవారికీ అర్ధంకాకుండా ఉంది. ఇలా తరలించడం వల్ల తాము కోర్ట్ కేసుల్లో ఎక్కడ ఇరుక్కుంటామో అని భయపడుతున్నారని అన్నారు.
జగన్ సర్కారు ఈ చీకటి జీవోలు ఆపాలి..
అంతేగాక, రాష్ట్రంలో ఉద్యోగులు అందరినీ ముందుండి నడిపించే అత్యున్నత స్థాయి అధికారి సెలవు పెట్టేద్దామన్న ఆలోచనలో వున్నారని వస్తున్న వార్తలు వారు ఎంత అభద్రతాభావంలో వున్నారో తెలుపుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. జీవో నెం.13 విడుదలైనప్పుడే ఇది రాజధాని తరలింపుపై దాఖలైన కేసుల పరిధిలోకి వస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. వారు అనుకున్న విధంగానే ఈ జీవో హైకోర్ట్ ముందుకు వచ్చింది.ఇకనైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ దొడ్డిదారి చీకటి జీవోలు ఆపడం సర్వత్రా శ్రేయస్కరం అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.
అమరావతిలో జనసేన-బీజేపీ నేతలు
కాగా, రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను తాము సమర్థిస్తాం కానీ.. పరిపాలన మాత్రం ఒకే ప్రాంతం నుంచి జరగాలని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. జగన్ సర్కారు భూములిచ్చిన రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. తాజాగా, బీజేపీ-జనసే నేతలు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రైతులకు సంఘీభావం తెలిపి వారిక అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమరావతి కోసం తాము కూడా పోరాడతామని చెప్పారు.