ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధం, మళ్లీ తెలుగు రాష్ట్రాలు కలుస్తాయని కాదు: పవన్ కళ్యాణ్, వైసీపీ డుమ్మా
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. (ఆయన విభజన జరిగిన విధానాన్నే తప్పుబట్టారు.. విభజనను కాదు. పలు సందర్భాల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడాన్ని సమర్థించారు.) ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పక్షాలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏపీకి ఎంత ఇవ్వాలన్న దాని పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు.
డబ్బు ఉండటం కాదు.. తీయాలి, రూ.60 కోట్లు సంపాదించి పెడతానని.. ఇది జగన్ మాట: నాగబాబు షాకింగ్
ఎవరు ఏ లెక్క చెప్పినా ఏపీకి అన్యాయం జరిగింది
ఎవరు ఏ లెక్క చెప్పినా రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేది మాత్ర వాస్తవం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి జరిగిన నష్టంపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం మినహా మిగతా పార్టీలు అన్నీ హాజరయ్యాయి. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.
ఉండవల్లిపై ప్రశంసలు
విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయంపై ఉండవల్లి అరుణ్ అన్ని చోట్ల మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్వాది అయినప్పటికీ విభజన ద్వారా ఓ తప్పు జరిగిందని గుర్తించి, భావి తరాలకు ఈ నష్టం జరగకూడదని ఆలోచించి ఉండవల్లి ముందుకు వచ్చారని చెప్పారు. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు కలుస్తాయని కాదని, విభజనకు జరిగిన అన్యాయంపై ఆయన పుస్తకం రాశారని చెప్పారు.
టీడీపీ నుంచి చంద్రబాబు వచ్చారంటూ
ఏపీకి జరిగిన అన్యాయంపై మనం మాట్లాడకుంటే, అన్ని పార్టీలు ఏకతాటి పైకి రాకుంటే సరికాదని పవన్ అన్నారు. లాగి చెంప పైన కొట్టినా పౌరుషం లేనట్లుగా ఉండవద్దని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నుంచి వచ్చిన నేతలను ఈ సందర్భంగా జనసేనాని ప్రస్తావించారు. ఈ సందర్భంగా వెనుక నుంచి ఒకరు టీడీపీ నుంచి చంద్రబాబు, నక్కా ఆనంద్ బాబు, కుటుంబ రావుల పేర్లు చెప్పగా.. జనసేనాని ప్రస్తావించారు. పవన్ వారి పేర్లు కూడా ప్రస్తావించారు. భావితరాల కోసం ఉండవల్లి ఈ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేశారని, అందుకే తాను మద్దతు పలుకుతున్నానని చెప్పారు.