కాకినాడ పోర్టు అక్రమాలు, జగన్-చంద్రబాబులకు లింక్ పెట్టిన పవన్ కళ్యాణ్
కాకినాడ: కాకినాడ సీ పోర్ట్స్ యజమాని కేవీ రావు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టులో చాలా అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మౌనం చూస్తుంటే వారిద్దరికి అవినీతిలో వాటా ఉన్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు.
కంఠంలో ప్రాణం ఉండగా అలా కానివ్వను, 100 కోట్ల ఆదాయం వదిలేశా: బాబు-జగన్లపై పవన్
చిన్న సినిమా థియేటర్ నడుపుకునే ఆయనకు సీపోర్ట్ ఎలా వచ్చిందో తేలుస్తానని వ్యాఖ్యానించారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ మత్స్యకారులను వేధిస్తున్న కేవీ రావు అమెరికాలో ఉంటారన్నారు. అతనిపై అమెరికా ప్రభుత్వానికి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
వారికి అర్థం కావట్లేదు
వ్యాపార లావాదేవీల కోసం భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. దురదృష్టవశాత్తూ పోర్టులో జరిగే అక్రమాల వలన ఇక్కడి యువత ఏ స్థాయిలో నష్టపోతుందో వారికి అర్థం కావడం లేదని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాడేందుకు తాను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు. పోర్టులో జరిగే అక్రమాలను వెలికి తీసేందుకు మా టీమ్ ఎంతో కష్టపడి తీసుకు వచ్చారని చెప్పారు. చాలాచోట్ల సిబ్బంది అడ్డుకున్నారని చెప్పారు.
ఆఫ్రికాకు వెళ్లినప్పుడు ఏం జరిగిందంటే
కాకినాడ పోర్టులో అక్రమంగా జరిగే బియ్యం రవాణా లారీలను గతంలో జాయింట్ కలెక్టర్ పట్టుకున్నప్పటికి అది ఎందువల్ల బయటకు రాలేదు అనేది అందరికి తెలుసునని పవన్ అన్నారు. జనసేన సిద్ధాంతాలలో ముఖ్యమైనది వాతావరణ పరిరక్షణ అన్నారు. తాను ఆఫ్రికాలోని దేశాలకు వెళ్ళినప్పుడు ఓసారి అనుకోకుండా ఒక మొక్కపై నుంచి తన కారు వెళ్తే, అక్కడి జనం వచ్చి మమ్మల్ని నిలదీశారని, ఎంతో జాగ్రత్తగా వారు చిన్న మొక్కను చూసుకుంటున్నారని, కానీ ఇక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారన్నారు.
దీనికి సమాధానం చెప్పండి
కాకినాడ నగరానికి రక్షణగా సహజ సిద్ధంగా ఉన్న హోప్ ఐలాండ్ను అడ్డగోలుగా దోచేస్తున్నారని, నగరానికి ఏమైనా వీరు పట్టించుకోవడం లేదని పవన్ అన్నారు. ఒక సాధారణ మెలోడీ సినిమా హాల్ యజమానికి ఇన్ని వేల కోట్ల దోపిడీ చేస్తూ, టాక్స్ ఎగ్గొడుతుంటే ఎందుకు చూస్తూ ఉన్నారని, దీంట్లో అధికార, ప్రతిపక్షాలకు వాటా ఉందా అని ప్రశ్నించారు. నేను మాట్లాడితే నిందలు వేస్తున్నారని ఆరోపిస్తారని, మరి జాయింట్ కలెక్టర్ అక్రమ రవాణా జరుగుతుందని పట్టేశారని, మరి దీనికి ఏం మాట్లాడుతారన్నారు.
మీరు ఒప్పుకున్నట్లే
చంద్రబాబు, జగన్లు కేవీ రావును పిలిపించి విచారించకుంటే వారికి కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఒప్పుకున్నట్లే అన్నారు. ఈ పోర్టు రూ.300 కోట్లతో ప్రారంభించారని, కేవీ రావుకు చంద్రబాబు, వైయస్ రాజశేఖర రెడ్డిలు మద్దతిచ్చారని, ఈ దోపిడీ గురించి వారు ఏమీ మాట్లాడటం లేదన్నారు. కేవీ రావు పైన టీడీపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ పోర్టులో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.