అవమానకరంగా తరిమేశారు! అలా చేయండి: పవన్ను ఆకట్టుకున్న కథనం, కేజ్రీతో పోలిక
హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ రోజు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని జనసైనికులు చదవాలని ట్వీట్ చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి పుల్లారావు అద్భుతమైన కథనం రాశారని ప్రశంసించారు.
Recommended Video
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీని, ఏపీలో జనసేనను పోల్చుతూ చేసిన తప్పులు, భవిష్యత్తు పోరాటాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో మంచి అభిప్రాయాలు చెప్పారని అన్నారు. జనసేనను ఏర్పాటు చేసిన ఉద్దేశం, పార్టీ లక్ష్యాలు, రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావడం వంటి అంశాలపై మమ్మల్ని మేము సరిదిద్దుకుని ముందుకు సాగుతామన్నారు.
పవన్ కళ్యాణ్ను ఆకట్టుకున్న కథనం
పుల్లారావు తన సుదీర్ఘ కథనంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్కు ఎన్నారైల మద్దతు, చివరి క్షణం వరకు ఆయన టిక్కెట్లను ప్రకటించకపోవడం, ఆర్టీఐ చట్టం, గాంధీ టోపీ, కేజ్రీవాల్ నుంచి తీసుకోవాల్సిన మంచి విషయాలను.. ఇలా పలు అంశాలను పొందుపరుస్తూ కథనం రాశారు. ఇది పవన్ కళ్యాణ్ను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే దీనిని చదవాలంటూ జనసైనికులకు సూచించారు.
అత్యంత అవమానకరంగా తరిమేశారు
2013లో ఢిల్లీలో కేజ్రీవాల్ కాంగ్రెస్, బీజేపీలను తరిమేశారని, నాడు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ అదే పరిస్థితుల్లో ఉన్నారని, ప్రతి రాజకీయ సన్నివేశం విభిన్నంగా ఉండవచ్చు కానీ, ఏపీలో పవన్ ఆయన నుంచి కొన్ని తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు టీడీపీ, వైసీపీని తరిమేయాలని అభిప్రాయపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్లను కేజ్రీవాల్ తరిమేయడమే కాకుండా, అవమానకరంగా తరిమేశారన్నారు.
పవన్ కళ్యాణ్ వారిని చేర్చుకోవాలి
పవన్, కేజ్రీవాల్లకు కొన్ని పోలికలు ఉన్నాయని, ఇద్దరు జనాకర్షక నాయకులు అని, వృత్తిరీత్యా రాజకీయ నాయకులు కారని, ఇద్దరూ రాగల పరిణామాలపై ఎలాంటి వెరపు లేకుండా పోరాడేందుకు సిద్ధంగా ఉటారని, వీరిద్దరు టెల్ఫేన్ కోట్ వంటి వారని చెప్పారు. టెల్ఫేన్ కోట్ అంటుకునే రసాయనం కాదన్నారు. వీరిపై ఆరోపణలు నీటి మీద బిందువుల్లా జారిపోతాయన్నారు. కేజ్రీవాల్ ప్రతి ఒక్కరిని తమ పార్టీలో చేరమని చెప్పేవారన్నారు. కేజ్రీకి అధికారుల మద్దతు ఉందని, ఇప్పుడు ఏపీలోను చంద్రబాబు ప్రభుత్వంపై అధికారులు వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. జనసేనలో రిటైర్డ్ ఉద్యోగాలను చేర్చుకోవాలన్నారు.
వాడవాడకీ జనసేన
వాడవాడకీ జనసేన జెండా కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని రాజకీయ వ్యవహారాల కమిటీకి పవన్ కళ్యాణ్ అంతకుముందు సూచించారు. ఇటీవల పార్టీ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ ఉద్దేశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, జనానికి చేరువలో ఉండాలన్నారు. జనసేన బలోపేతానికి ప్రణాళిక బద్ధంగా అడుగులు వేయాలన్నారు.