నాకు టైమ్ కావాలి, మీరు ఎన్ని సీట్లు ఇచ్చినా పోరాటం చేస్తా: పవన్ కళ్యాణ్
ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఏలూరులో జూడాలతో, వివిధ వర్గాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సినిమాలలోకి వచ్చాక రాజకీయాల్లోకి వచ్చారని అనుకుంటారని, కానీ సినిమాల్లోకి రాకముందే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రీసెర్చ్ సెంటర్ కోసం తాను హార్వార్డ్ యూనివర్సిటి నుంచి వైద్య బృందాన్ని తీసుకు వస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని చెప్పారు.
చంద్రబాబు-లోకేష్ అవినీతిపై ఆధారాల్లేవు: హైకోర్టులో పిల్ ఉపసంహరణ
అధికార, ప్రతిపక్ష నేత మాదిరి నోటికి వచ్చింది చెప్పి, తర్వాత తప్పించుకునేవాడిని కాదని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పక్షంలో వాటికి వివరణ ఇచ్చుకోవాల్సి ఉందని చెప్పారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకు రావడమే తన లక్ష్యమని చెప్పారు. జనసేన కుల, మత, ప్రాంతాలకు అతీతమన్నారు. ఉన్న సంపద అంతా కొంతమంది చేతుల్లోకి మాత్రమే వెళ్తుందని, ఆ సంపదను అందరికీ పంచడమే జనసేన ఉద్దేశ్యమని చెప్పారు.
అర్థం చేసుకోవడానికి సమయం కావాలి
జనసేన అధికారంలోకి వస్తే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు రూ.ఐదు లక్షల బీమా, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని పవన్ తెలిపారు. అందరి సమస్యలను అవగాహన చేసుకోవడానికి కొంత సమయం కావాలని, మీ నుంచి సమస్యలు విని, ఆర్థం చేసుకుంటే వాటిని మేనిఫెస్టోలో ఎలా చేర్చాలన్న అంశాన్ని ముందుకు తీసుకు వెళ్లడం తేలిక అన్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో జనసేన స్థాపన
చాలా ప్రతికూల పరిస్థితుల్లో జనసేనను స్థాపించానని, ప్రస్తుతం రాజకీయాలు అవకాశవాదంతో నిండిపోయాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీ నడపాలంటే వేల కోట్లు అవసరమన్నాుర. తన వద్ద వేల కోట్లు లేకున్నప్పటికీ కోట్లాది మందికి సేవ చేయాలన్న బలమైన సంకల్పం మాత్రం ఉందని చెప్పారు. సహకార సంఘాల ఉద్యోగులు కనీస జీతాలు లేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని వాపోయారు. పిల్లలకు పెళ్లిళ్లు చేసుకోలేని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారన్నారు.
నా వద్ద మంత్రదండం లేదు
సమస్యలను చిటికెలో తీర్చడానికి తన వద్ద ఎలాంటి మంత్రదండం లేదని పవన్ అన్నారు. సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేయించి, పరిష్కరిస్తానని చెప్పారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా పరిష్కార మార్గాలు అన్వేషించి మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. సమగ్ర అధ్యయనం తర్వాత ప్రతి రైతుకి మేలు జరిగే రీతిలో మా పథకాలు ఉంటాయని చెప్పారు. రైతు కన్నీరు పెట్టవద్దంటే ముందు సహకార సంఘ ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు.
మీరు ఎన్ని సీట్లు ఇచ్చినా నేను పోరాటం చేస్తా
తనకు ఎన్ని సీట్లు ఇచ్చి చట్ట సభలకు పంపించినా ప్రజల తరఫున మాత్రం పోరాటం చేస్తానని పవన్ చెప్పారు. జనసేన ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. విలువలతో కూడిన నాయకత్వం, ఆలోచన విధానం పాలకుల్లో చచ్చిపోయాయన్నారు. సమస్యలు చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి, ఇంకా బాగా చేయ్ అని భుజం తట్టేవారు ఉంటారని, కానీ పక్కన నడిచేవాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారని చెప్పారు. సాటి మనిషి బాధ చూడలేక రాజకీయాల్లోకి వచ్చానని, ఎవరో బలవంతపెడితే రాలేదన్నారు. 25 ఏళ్లు పని చేస్తే తప్ప బలమైన ప్రజా విధానాలను తీసుకు రాలేమన్నారు. అందుకే రాజకీయాలకు ఓపిక అవసరమన్నారు.