బాబు రెబలా?.. అవకాశవాదా?: మళ్లీ ఏకేసిన పవన్, లోకేష్ అవినీతిపై ఆధారాలున్నాయ్!
హైదరాబాద్: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. హోదా చుట్టు తిరుగుతున్న రాజకీయంలో.. ఎవరిది డ్రామా?.. ఎవరిది చిత్తశుద్ది? అన్న ప్రశ్నలు తలెత్తతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీపై అస్త్రాలు ఎక్కుపెట్టడం ఆ పార్టీని ఇరుకునపడేసింది. దీంతో కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టిన టీడీపీ.. ఇదంతా బీజేపీ ఆడుతోన్న నాటకమని.. రాష్ట్రాన్ని మరో తమిళనాడు తరహాలో మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా ఇందులో ఓ పావుగా మారారని ఘాటైన వ్యాఖ్యలే చేసింది. తాజాగా జాతీయ మీడియా(ఇండియా టుడే, ఎన్డీటీవి)తో మాట్లాడిన పవన్ కల్యాణ్ మరోసారి టీడీపీని తీవ్రంగా విమర్శించారు.
రెబలా?.. అవకాశవాదా?
చంద్రబాబు నిజంగానే కేంద్రంపై తిరగబడుతున్నారా?.. లేక 'హోదా' అంశాన్ని అవకాశవాద రాజకీయంగా మారుస్తున్నారా? అన్న అంశంపై 'ఇండియా టుడే' పవన్ కల్యాణ్ ను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన పవన్.. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు.
టీడీపీ, వైసీపీలు చేస్తున్నది కేవలం డ్రామా అని తేల్చేశారు. హోదా విషయంలో చంద్రబాబు చాలా ఆలస్యంగా స్పందించారని, ఒకవిధంగా ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. టీడీపీ ప్రజల సెంటిమెంటుతో ఆడుకుందన్నారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్ల పిల్లవాడిని అడిగినా ఇదే విషయం చెబుతారని అన్నారు.
హోదాపై..:
14ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రానికి హోదా ఇవ్వడం సాధ్యం కాదంటోంది కేంద్రం. దానికి సరిసమానంగా ప్యాకేజీ పేరుతో 90శాతం నిధులు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం దేనికి? అని ఇండియా టుడే పవన్ను ప్రశ్నించింది.
కేంద్రానికి రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే.. ప్యాకేజీపై అర్థరాత్రి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్ ప్రశ్నించారు. ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వకపోవడం వల్ల వాళ్లలో చాలా గందరగోళం నెలకొందన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఏదో ఒకటి తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై..:
పోలవరం విషయంలో చంద్రబాబు తీరును తప్పు పట్టారు పవన్. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు.. దాని బాధ్యతను కేంద్రానికి వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వమెందుకు తలకెత్తుకుందని ప్రశ్నించారు. ప్రైవేటు కాంట్రాక్టర్లకు పోలవరం ప్రాజెక్టును అప్పగించాల్సిన అవసరమేంటని నిలదీశారు.
బీజేపీకి మద్దతునిస్తారా?..:
ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిస్తారా? అన్న ప్రశ్నకు.. వ్యక్తిగతంగా తనకు మోడీపై చాలా గౌరవం ఉందని, కానీ పాలిటిక్స్ విషయంలో ప్రజల పక్షమే ఉంటానని పవన్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత నిర్ణయాల కన్నా, ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా తన రాజకీయాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల్లో మాత్రం బీజేపీ పట్ల స్పష్టమైన వ్యతిరేకత, ఆగ్రహం కనిపిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది సమీప భవిష్యత్తులో నిర్ణయిస్తామన్నారు.
లోకేష్ అవినీతిపై ఆధారాలున్నాయా?
మంత్రి లోకేష్ పై బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేశారు కదా? మీ వద్ద ఆధారాలున్నాయా? అని ప్రశ్నించగా.. 'అవును' అని బదులిచ్చారు పవన్. సందర్బం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతానని అన్నారు. ఏమి లేకుండానే ఎందుకు ఆరోపణలు చేస్తానని అన్నారు.
బీజేపీతో సంబంధం లేదు..:
తమిళనాడులో రజనీకాంత్ను ముందుపెట్టి రాజకీయం చేస్తున్నట్టు.. ఏపీలోనూ పవన్ కల్యాణ్ను ముందుపెట్టి బీజేపీ రాజకీయం చేస్తోందా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని సమాధానం ఇచ్చారు. తాను పూర్తి క్లారిటీతో ఉన్నానని, ప్రజల ముందు ఏ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని అన్నారు.
చిరు వేరు.. నా రాజకీయాలు వేరు..:
ఇక సినిమాలు మానేయడాన్ని తానేదో త్యాగం చేశానని అనుకోవట్లేదని, ముందు నుంచి ప్రజల కోసం ఏమైనా చేయాలనే ఆలోచన తనదని చెప్పారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చునని, నటులకు ప్రజలతో ఎక్కువ అనుబంధం ఉంటుంది కాబట్టి.. త్వరగా వాళ్లతో కనెక్ట్ అవుతారని అన్నారు. ఇక రాజకీయాల విషయంలో అన్న చిరు దారి వేరు, తన దారి వేరు అని తెలిపారు. భావజాలం విషయంలో ఇద్దరికీ చాలా స్పష్టమైన తేడా ఉందన్నారు.