కలిసివెళ్దాం రండి: జగన్-బాబులకు పవన్ కళ్యాణ్ కొత్త ఆఫర్, నాదెండ్ల-తోట పోటీ ఎక్కడి నుండి అంటే?
గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరులోని ఎల్ఈఎం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనసేన శంఖారావంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విషయంలో కలిసి పని చేద్దామని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. తొలుత ఆయన గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా, సభా ప్రాంగణానికి వచ్చారు.
ఏపీలో జెండా పాతి తీరుతా
ఈ సందర్భంగా మాట్లాడారు. కేవలం అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆ కోరికే ఉంటే ఎప్పుడో ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యేవాడినని చెప్పారు. వ్యవస్థలో అవినీతి ప్రక్షాళనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. అమరావతిలో జనసేన జెండా పాతి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. జనసేనను అణిచివేసేందుకు ఇతర పార్టీలు ఎన్ని వ్యూహాలు వేసినా ప్రతివ్యూహాలు తాను వేసేందుకు సిద్ధమని చెప్పారు.
వైసీపీ, టీడీపీలకు పవన్ కళ్యాణ్ ఆఫర్
ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీలకు పవన్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల్లో మనం వేర్వేరుగా పోటీ చేద్దామని, కానీ ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన వాటి విషయంలో కలిసి కట్టుగా పోరు చేద్దామని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా, విభజన అంశాలపై కలిసి పోరాడుదామన్నారు. అవినీతి రాజకీయాలతో విసిగిపోయామని, రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలన్నారు. అందుకే జనసేన పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ఎప్పటికైనా రాజకీయ పార్టీ పెట్టాలనే ఉద్దేశంతోనే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అప్పట్లో పెట్టానని, తన వద్ద డబ్బుల్లేవని, అభిమానులు, యువత అండ ఉందని చెప్పారు. ప్రాణాలకు తెగించి పోరాడే సత్తా ఉందన్నారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
నాకు ఎప్పుడు అవకాశమిస్తారో.. కానీ మార్పు తెస్తా
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని, జగన్ ఈసారి గెలిస్తే మరో ముప్పై ఏళ్లు అధికారంలో ఉండాలనుకుంటున్నారని పవన్ విమర్శలు గుప్పించారు. కానీ మీరు 2019లో తనకు ముఖ్యమంత్రిగా అవకాశమిస్తారో లేదో, లేక ఎప్పుడు ఇస్తారో తెలియదని, కానీ మీరు సీఎంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమిచ్చిన రోజు ఖచ్చితంగా ఒక బలమైన సామాజిక మార్పు తీసుకువస్తానని చెప్పారు. సామాన్యులు కూడా పారిశ్రామికవేత్తలుగా మారే విధానం రావాలని, అంతే తప్పించి నాయకుల అండదండలు ఉన్నవారు మాత్రమే అవ్వకూడదన్నారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని, అధికారం, పదవుల కోరిక ఉంటే 2009లో, 2014 తర్వాత టీడీపీ, బీజేపీల ద్వారానో ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యుండేవాడినని అన్నారు. వ్యవస్థలో అవినీతి ప్రక్షాళన జరగాలనే బలమైన సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
ఉండవల్లి మీటింగ్కు రండి, ఉత్తరాది నేతలపై ఆగ్రహం
ఉండవల్లి అరుణ్ కుమార్ 29వ తారీకున ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడటానికి అందరిని పిలిచారని, వైసీపీ నాయకులు రావడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉండవల్లి మీద గౌరవం, అలాగే ఆయన విభజన హామీల కోసం చేసిన పోరాటం మీద గౌరవంతో జనసేన ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు వెళ్తున్నామని చెప్పారు. వైసీపీ నాయకులు కూడా ఒకసారి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఒకే గొంతు వినిపించడానికి ఉండవల్లి మీటింగ్కి రావాలన్నారు. ఢిల్లీ వీధులు దద్దరిల్లేలా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడటానికి అందరం ఒకే వేదిక పైకి రావాలన్నారు. ఎలా అయితే ఏపీని అడ్డగోలుగా విభజించారో, ఒక రోజున ఉత్తరప్రదేశ్ కూడా నాలుగు ముక్కలుగా విభజించే రోజు వస్తుందన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తుంటే ఎలా అయితే నోరు మెదపకుండా, కాలు మీద కాలు వేసుకుని ఉత్తరాది నేతలు కూర్చున్నారో అది మర్చిపోలేదని, మా ఆత్మ గౌరవం చచ్చిపోలేదన్నారు.
నాదెండ్ల, తోటలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పిన జనసేనాని
బీజేపీ ప్రత్యేక హోదా గురించి మరిచిపోయిందని, చంద్రబాబుకు ఆ విషయం ఆరు నెలలకు ఓసారి గుర్తుకు వస్తుందని, హోదా కోసం పోరాటం చేద్దామని పిలిస్తే వైసీపీ నాయకులు కలిసి రావడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎన్నికల్లో కావాలంటే విడిగా పోటీ చేద్దామని, ఏపీ ఆత్మగౌరవం కోసం కలిసి పనిచేద్దామన్నారు. ఢిల్లీ నాయకుల వెన్నులో వణుకుపుట్టేలా కలిసి పోరాడుదామన్నారు. ఇదే వేదికపై తమ పార్టీ నేతలైన తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ పోటీచేసే స్థానాలను ప్రకంటించారు. గుంటూరు నుంచి తోట చంద్రశేఖర్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని చెప్పారు.
టట్టూ వేసుకున్నాడని బెదిరింపులు
చివరగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... 'నేను జైహింద్ అని చెప్పిన తరువాత వెళ్లిపోతాను, కానీ ఈరోజు మాట్లాడుతున్నాను, ఫయాజ్ అనే జనసైనికుడు మన పార్టీ గుర్తును చేతి మీద వేయించుకున్నారని బెదిరిస్తున్నారు, అతనిని బెదిరించే వారు ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఊరుకోను' అని హెచ్చరించారు.