జనసేన అక్కడే ఫోకస్ చేస్తోంది, ఎందుకు?: పవన్ కళ్యాణ్పై వైసీపీ అనుమానం
అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న స్థానాలపై ప్రధానంగా దృష్టి సారించిందని తెలుస్తోంది. చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జనసేన భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు పడే విధంగా ప్రధానంగా వైసీపీకి గట్టిపట్టు ఉన్నచోట్ల ఎక్కువగా దృష్టి సారించిందట. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి పలు జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.
వైసీపీకి పట్టుఉన్న ప్రాంతాలపై దృష్టి
2019 సార్వత్రిక ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్తో సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీల వలే ప్రచారంలో దూకుడు కనిపించకపోయినప్పటికీ, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, జనసేన బలోపేతంపై దృష్టి సారించారు. అప్పుడప్పుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. టీడీపీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని జనసేనాని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు వెళ్లకుండా చూడటంతో పాటు ఆ పార్టీకి గట్టి పట్టు ఉన్న స్థానాలపై దృష్టి సారించారట.
అందుకే ఆ ప్రాంతాలపై దృష్టి
పవన్ కళ్యాణ్ అధికార పార్టీని టార్గెట్ చేయడం వదిలేసి, తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించారని వైసీపీ నేతలు చెవులు కొర్కుకుంటున్నారట. కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ పర్యటించారని, వీరు టీడీపీకీ వ్యతిరేకమని, అలాంటి కాపులు ఎక్కువగా ఉన్నచోట వారి ఓట్లు చీల్చేందుకు పవన్ అక్కడ పర్యటిస్తున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారట. తద్వారా టీడీపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారట. అయితే కాపు ఓట్లు ఎక్కువగా జనసేనానికే వెళ్తాయనేది చాలామంది అభిప్రాయం. మరోవైపు, టీడీపీకి ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించడం లేదని అంటున్నారు. పవన్ మాత్రం వరుసగా జిల్లాల్లో పర్యటించే కార్యక్రమాలు సిద్ధం చేసుకున్నారు.
ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్పై టీడీపీ మౌనం
గత ఏడాదిగా ఏపీలో రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్డీయే నుంచి బీజేపీ బయటకు రావడం మొదలు.. రాజకీయ వేడి ప్రారంభమైంది. అలాగే, జనసేనాని ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించిన తర్వాత మరింత వేడెక్కింది. సందర్భం వచ్చినప్పుడల్లా జనసేనాని అధికార, ప్రతిపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో జగన్ కూడా టీడీపీ, జనసేనలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం తొలుత పవన్పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగి, ఇటీవల మౌనంగా ఉంటోంది. అలా మౌనంగా ఉండటానికి పలు రకాల ప్రచారాలు సాగుతున్నాయి.