పవన్కు అంత సీన్ లేదా?: కుండబద్దలు కొట్టిన పోసాని.. ఎవరెంత ప్రలోభ పెట్టినా!
తనను ఎవరెంత ప్రలోభపెట్టినా.. డబ్బు, పదవి ఆశ చూపినా.. ఏం చేసినా సరే.. తన ఓటు మాత్రం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికేనని కుండ బద్దలు కొట్టారు.
హైదరాబాద్: దూకుడైన స్వభావంతో.. ముక్కుసూటిగా మాట్లాడే నటుడు పోసాని కృష్ణమురళి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలైనా.. సమకాలీన రాజకీయాలైనా.. నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు పోసాని. తాజాగా ఓ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఏపీ రాజకీయాలపై స్పందించారాయన.
చంద్రబాబు, జగన్, పవన్ లలో ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారని సదరు జర్నలిస్టు ప్రశ్నించగా.. జగన్ కే ఎక్కువ మార్కులు వేస్తానన్నట్లుగా ఆయన స్పందించారు. తనను ఎవరెంత ప్రలోభపెట్టినా.. డబ్బు, పదవి ఆశ చూపినా.. ఏం చేసినా సరే.. తన ఓటు మాత్రం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికేనని కుండ బద్దలు కొట్టారు.
ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి తిరుగు ఉండదని, తన వ్యక్తిత్వమే అలాంటిదని పోసాని పేర్కొన్నారు. జగన్ కు సపోర్ట్ చేసినంత మాత్రాన.. ఆయన పదవి ఆఫర్ చేసినా తనకు అక్కర్లేదని అన్నారు. పోటీ చేయమని జగన్ కోరినా.. తాను పోటీ చేయనని తెలిపారు.
ఇక జనసేన గురించి ప్రస్తావిస్తూ.. ఆ పార్టీ మీద తనకు నమ్మకం లేదన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం స్థాయి మెటీరియల్ లాగా కనిపించడం లేదన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గురించి తాను ఆలోచించడం లేదని చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి పవన్ కు అంత సీన్ లేదని పోసాని ఒక్కమాటలో తేల్చేసినట్లు స్పష్టమవుతోంది.
వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీకి తాను ఓటేయబోనని కూడా ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబులో ఒకప్పుడు కనిపించిన సమర్థత ఇప్పుడు కరువయిందన్నారు.
మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో వైసీపీ గాలి వీస్తుందని పోసాని బలంగా నమ్ముతున్నట్లు అర్థమవుతోంది. అదే సమయంలో జనసేన ప్రభావం అసలేమి ఉండబోదనేది ఆయన మాటల ద్వారా వెల్లడవుతోంది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్.. భవిష్యత్తు వైసీపీదే అని ఇప్పటికే పరోక్ష సంకేతాలు పంపించారు. ఇటు పోసాని లాంటి వాళ్ల మాటలు వైసీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవిగా మారాయి. అయితే కేవలం వ్యక్తుల మాటల్ని బట్టి రాజకీయాలను డిసైడ్ చేయడం కష్టమే. చూడాలి మరి.. వైసీపీ విషయంలో వీరి నమ్మకాలు ఎంతమేర నిజమవుతాయో!