పవన్ కల్యాణ్ నిన్న చంద్రబాబు, నేడు బీజేపీతో.. స్థిరత్వం లేదని మంత్రి ధర్మాన ధ్వజం
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఫైరయ్యారు. ఆయనకు స్థిరత్వం లేదని విరుచుకుపడ్డారు. మొన్నటివరకు చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకొని తిరిగిన పవన్ కల్యాణ్.. నేడు టీడీపీకి బైబై చెప్పారని గుర్తుచేశారు. మరి కమలదళంతో సావాసం ఎన్నిరోజులో చూడాలాన్నారు. దీనినిబట్టి పవన్ కల్యాణ్కు స్థిరత్వం లేదని అర్థమవుతోందని చెప్పారు. ఆదివారం శ్రీకాకుళంలో వైసీపీ నేతలు ర్యాలీ తీశారు. విశాఖపట్టణం రాజధానిని స్వాగతిస్తూ తీసిన ర్యాలీలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సూర్యమహల్ జంక్షన్ నుంచి సెవెన్ రోడ్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది.
భేషరతుగా ఎందుకు..?
బీజేపీని అడ్డుపెట్టుకొని లబ్ధిపొందాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. కానీ బీజేపీ మాత్రం పవన్ కల్యాణ్కు హ్యాండిస్తారన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని అడగకుండా.. భేషరతుగా ఎలా కలిసి పనిచేస్తారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తీరును ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మొన్నటి వరకు చంద్రబాబు ఏం చెబితే అది చేసినా పవన్ కల్యాణ్.. నేడు బీజేపీ పెద్దలు ఆడిస్తే ఆడుతారని చెప్పారు.
సరికాదు..
ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ధర్మాన కృష్ణదాస్ ఫైరయ్యారు. అమరావతి రాజధాని పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అమరావతి పరిసర గ్రామాల్లో టీడీపీ నేతలు, చంద్రబాబు బంధువుల భూములు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కానీ రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
ధర్మాన సవాల్..
అమరావతి రాజధాని కోసం జరిగే ఆందోళనలను 5 కోట్ల ఆంధ్ర ప్రజలు గమనిస్తున్నారనే విషయం చంద్రబాబు నాయుడు గుర్తించాలని సూచించారు. ప్రతిపక్ష నేతగా రైతులను రెచ్చగొడుతున్నారని చంద్రబాబుపై ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే తనపై నరసన్నపేటలో పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు.