మోడీకి ఎదురెళ్తా, విలీనం చేయకుంటే దెబ్బతీస్తున్నారు: అమిత్ షాపై పవన్ షాకింగ్ కామెంట్స్
ఒంగోలు: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనను పార్టీలోకి ఆహ్వానించారని, తన పార్టీని విలీనం చేయాలని అడిగారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం చెప్పారు. కానీ తాను వారి ఆఫర్ను తిరస్కరించినట్లు చెప్పారు. తాను ప్రజల కోసం పార్టీ పెట్టానని తెలిపారు. ఈ సందర్భంగా తమిళనాడులోని రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చదవండి: పవన్! అల్లు అరవింద్పై ఏడవకు: కత్తి మహేష్, చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో పోటీ చేస్తే తాను ఓడిపోతానేమో కానీ, అవతలి వారిని దెబ్బకొడతానని టీడీపీ, బీజేపీలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక హోదా, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. తాము ఎన్నికలకు సిద్ధమని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
చదవండి: వైసీపీ ప్రశ్న: అనూహ్య నిర్ణయం తీసుకున్న పవన్, నేను ముఖ్యమంత్రిని అయితే...
చదవండి: పరిటాల గుండు కొట్టించలేదు, నేనే, ఊరుకునేవాడినా: పవన్, వంగవీటి రంగా హత్య, కులపిచ్చిపైనా..
ఎన్నికలకు సిద్ధంకండి, టీడీపీని ఓడించేవాడిని
2019 ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు, తన అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు సన్నాహంగా వచ్చే మార్చిలో రెండు తెలుగు రాష్ట్రాల జనసేన ప్లీనరీని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శనివారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తలతో ఒంగోలులో ఆయన సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ, వైసీపీలపై మండిపడ్డారు. 2012లోనే జనసేనను స్థాపించి, 2014 ఎన్నికలలో పోటీ చేసి ఉంటే టీడీపీ గెలిచేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆ ఎన్నికలలో తాను గెలవకపోయినా టీడీపీని ఓడించేవాడినని చెప్పారు. వచ్చే మార్చి 14న ప్లీనరీ ఉంటుందని తెలిపారు.
హోదాపై టీడీపీ, వైసీపీల ఎందుకు నిలదీయట్లేదు
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీల తీరు బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు పార్టీలు ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. హోదా కోసం సామ, ధాన, భేదోపాయాలు ప్రయోగించి చివరగా రోడ్డుపైకి వచ్చి ఉద్యమిస్తానన్నారు. అసలు ఇస్తారా? లేదా? ఇస్తే ఇవ్వండి, లేదంటే ఎందుకివ్వరో కారణాలు చెప్పాలని బీజేపీని నిలదీశారు. కోట్లాది మంది ప్రజలకు కేంద్రం ఇచ్చిన హామీలపై టీడీపీ, వైసీపీ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.
నో అంటే దెబ్బ, అమిత్ షాపై సంచలన ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రాన్ని అందరు పోరాడి సాధించుకున్నారని, ప్రత్యేక హోదా సాధనకు టీడీపీ, వైసీపీ పోరాడలేవా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసెంబ్లీని వైసీపీ బహిష్కరించడం సరైన చర్య కాదన్నారు. దేశ భవిష్యత్తు జాతీయ పార్టీల చేతులలోనే ఉందని అమిత్ షా అభిప్రాయపడుతున్నారని, ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, విలీనానికి కుదరదంటే దెబ్బ తీస్తున్నారని బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
మోడీ బలమైన నేత, సొంతగా ఎదుర్కోలేక
జనసేన ఏర్పాటు వెనుక బృహత్తర లక్ష్యం ఉందని, అందుకే అమిత్ షా కోరినా ఆ పార్టీలో చేరలేదన్నారు. ప్రధాని మోడీ బలమైన ప్రధాని అని, ఒంటరిగా ఎదుర్కొనేకన్నా జనబలంతో ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. హోదాపై పోరాడేందుకు సిద్ధమేనని పవన్ ప్రకటించారు. మోడీకి ఎదురెళ్లాలని అనుకోనని, కానీ అలాంటి పరిస్థితి వస్తే భయపడేది లేదన్నారు. హోదా బీజేపీ ఇచ్చిన హామీ అని, కాబట్టి మోడీకి ఎదురు వెళ్లాల్సి వస్తే అందుకు సిద్ధమని చెప్పారు.
నాడు మాటిచ్చారని
నాడు సంస్థానాలన్నీ దేశంలో విలీనమైనప్పుడు రాజభరణాలు ఇవ్వడాన్ని కొందరు వ్యతిరేకించారని కానీ, పార్లమెంట్లో మాట ఇచ్చాం కాబట్టి నెరవేర్చాలని సర్దార్ పటేల్ చెప్పారని పవన్ గుర్తు చేశారు. నేడు హోదా విషయంలో పార్లమెంట్లో మాట ఇచ్చి తప్పారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరో కారణాలు చెప్పాలని, అవి సంతృప్తి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని, అత్యధిక ప్రజలు ఒప్పుకొంటేనే అంగీకరిస్తామన్నారు.
బీజేపీ ఎంపీ గోకరాజుపై విమర్శలు
బీజేపీ ఎంపీ గంగరాజు కులపరంగా ఆలోచించి జనసేన కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తనకు పరిటాల రవి గుండు కొట్టించారని కొందరు టిడిపి నేతలు ప్రచారం చేశారని, కానీ తాను అలాంటి అవాస్తవాలను, అనవసరపు ప్రచారాన్ని మనసులో పెట్టుకోకుండా టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పారు. అది ప్రజల పట్ల తన బాధ్యత అన్నారు.
ప్రాక్టికల్ మనిషిని
కార్యకర్తలు పదేపదే సీఎం... సీఎం.. పవన్ సీఎం.. అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ తన ప్రసంగాన్ని ఒక్కసారి నిలిపివేసి నవ్వుతూ మాట్లాడారు. మీరు సీఎం.. సీఎం అన్నా నేను కానని, తనకు అది ఇష్టముండదని, ఎందుకంటే సీఎం అంటే చాలా కష్టమైన, బాధ్యతతో కూడినదని, అందుకు అనుభవం కూడా ఉండాలని, కానీ నేను చాలా ప్రాక్టికల్గా ఉంటానని, అధికారం లేకపోయినా ఫర్వాలేదని, నమ్మకాన్ని పోగొట్టుకోనని చెప్పారు. మీరు చూస్తున్నట్టు మేకప్ వేసుకోవడం, సున్నితంగా ఉండటమే కాదు, అవసరమైతే ఆయుధం పట్టుకుంటానని, ప్రజల కోసం పోరాడుతానని చెప్పారు.