జనసేన సేనాని ఏపీకి కాబోయే సీఎం ! జోస్యం చెప్పిన మాయావతి .
Recommended Video
విశాఖపట్నం: రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి వస్తే.. ఉత్తర్ ప్రదేశ్ తరహా సుపరిపాలనను అందిస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. సజ్జన హితాయ, సజ్జన సుఖాయ అనే ప్రాథమిక సూత్రానికి లోబడి ఏపీని పరిపాలిస్తామని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణేనని ఆమె వెల్లడించారు. కేంద్రంలో కూడా బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కూడిన కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయ పడ్డారు. దేశంలో ఎన్డీఏ, యూపీఏలకు ప్రత్యాహ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల తరువాతే తేలుతుందని అన్నారు.
వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రంలో జనసేన పార్టీ-బీఎస్పీ-సీపీఎం-సీపీఐ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమి తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడానికి మాయావతి మన రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా బుధవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ లో పవన్ కల్యాణ్ తో కలిసి మాట్లాడారు.
నాలుగు సార్లు సీఎం అయ్యా..
ఉత్తర్ ప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రానికి తాను నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని మాయావతి చెప్పారు. తన హయాంలో హిందువులు, ముస్లింలు సామరస్యంగా కలిసి మెలిసి జీవించారని అన్నారు. తమ కూటమి ఏపీలో అధికారంలోకి వస్తే.. అలాంటి పరిపాలనను అందిస్తామని చెప్పారు. ప్రజల సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంపై స్పష్టత ఉందని అన్నారు. ప్రజలందర్నీ సమానదృష్టి చూస్తామని, అన్ని వర్గాల వారికీ సమాన, సామాజిక న్యాయాన్ని అందిస్తామని మాయావతి స్పష్టం చేశారు. తన హయాంలో ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీసిందని అన్నారు.
పవన్ లో ఆ ఫైర్ ఉంది..
పవన్ కల్యాణ్ యువకుడు, చిత్తశుద్ధి ఉన్న నాయకుడని మాయావతి ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే తపప ఆయనలో ఉందని, దాన్ని చూసే తాను జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నానని అన్నారు. సినిమారంగంలో పవన్ కల్యాణ్ అద్భుతంగా రాణించారని, రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో విజయాలు సాధిస్తారని తాను ఆశిస్తున్నట్లు మాయావతి చెప్పారు.
మేనిఫెస్టోను విడుదల చేయడం మా సంస్కృతి కాదు..
ఎన్నికలకు ముందు.. మేనిఫెస్టోను విడుదల చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని మాయావతి చెప్పారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అనేక లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను తాము ఎదుర్కొన్నామని, ఏనాడు కూడా మేనిఫెస్టోను విడుదల చేయలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే.. అజెండాను ప్రకటిస్తామని చెప్పారు. తాము ఏ విషయాన్నీ మాటల్లో చెప్పబోమని, చేతల్లో చేసి చూపిస్తామని అన్నారు. నరేంద్రమోడీ మాటకారేనని, తాను చేసిన హామీలను ఏనాడూ చేతల్లో చూపలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్-బీజేపీ పార్టీలకు అనేక అవకాశాలు ఇచ్చారని, ఈ సారి తమ కూటమికి అధికారాన్ని ఇచ్చి, పాలనలో ఉన్న తేడాను గమనించాలని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ (ఫొటోలు)
హోదా ఇస్తాం..
విభజన తరువాత ఏపీలో ఎలాంటి అభివృద్ధీ చోటు చేసుకోలేదని మాయావతి అన్నారు. ఆంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. జగన్ పార్టీ గానీ, చంద్రబాబు పార్టీ గానీ విసిరే వలలో పడొద్దని ఆమె సూచించారు. సరికొత్త నాయకులను, యువ రక్తాన్ని ప్రోత్సహిద్దామని సూచించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. తమ కూటమిని ప్రజలు ఆదరిస్తున్నారని మాయావతి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు తెలివిగా ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఓట్లను చీలుస్తామనుకోవడం భ్రమే
తమ కూటమి వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, టీడీపీ లబ్ది పొందుతుందనడంలో అర్థం లేదని మాయావతి చెప్పారు. ఏ పార్టీకి ఆ పార్టీ వేర్వేరు విధానాలు, మార్గాల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. దళితులు, ఇతర వర్గాల ఓట్లు తమ కూటమి పడతాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. తమ రాజకీయ ప్రత్యర్థులకు దళితుల ఓటు బ్యాంకు ప్రధానం కాదని, అధికారంలోకి రావడం కోసం మోసపూరిత వాగ్దానాలు ఇస్తున్నాయని విమర్శించారు. ఓట్లు చీలతాయనే భయం తమకు లేదని అన్నారు.
బీజేపీకి ఓటమి తథ్యం..
80 లోక్ సభ స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు. సమాజ్ వాది పార్టీతో తాము కలవడంతో బీజేపీలో ఓటమి భయం నెలకొందని చెప్పారు. ఈ సారి దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. యూపీఏ, ఎన్డీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాడాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది ఎన్నికల తరువాత తేలుతుందని మాయావతి చెప్పారు.
మాయావతిని ప్రధానిని చేస్తాం: పవన్ కల్యాణ్
దళితుల అభ్యున్నతి కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్న రాజకీయ నాయకురాలు మాయావతి మాత్రమేనని, ఆమెకు అండగా ఉండటం కోసం పొత్తు పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. మాయావతిని ప్రధానిని చేయాలనే ఏకైక అజెండాతో తాము పనిచేస్తామని అన్నారు. యూపీలో మాయావతి చేసిన అభివృద్ది పనులను తాము ప్రచారం చేస్తామని చెప్పారు. ఏపీ, తెలంగాణ నాయకులు ఎన్నికల ప్రచారంలో బూతులు తిట్టుకుంటున్నారని, దీని వల్ల సమస్య పరిష్కారం కాదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. 2007లో 45 వేల కోట్ల వరకు ఉన్న యూపీ బడ్జెట్ ను మాయావతి మూడు లక్ష కోట్ల రూపాయలకు తీసుకెళ్లారని అన్నారు. మాయావతి యూపీ అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు పరిపాలనలో. నోయిడాను అద్భుతంగా, మౌలిక వసతులను అత్యద్భుతంగా అభివృద్ధి చేశారని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేను కూడా మాయావతి శిక్షించారని, నడిరోడ్డుపై నడిపించారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు తప్పులు చేస్తున్నప్పటికీ.. ఇక్కడ పట్టించుకోవట్లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు.