ఏపీలో పవన్ కళ్యాణ్కు గ్రీన్ సిగ్నల్: రిజిస్ట్రేషన్ పూర్తి, పార్టీ గుర్తు..!
అమరావతి: సినీ నటుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో పూర్తి అయింది. 2014 సాధారణ ఎన్నికల్లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తింపు కోసం 2014 డిసెంబరు 10న ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో ఎన్నికల కమిషన్ తన ప్రకియను ప్రారంభించి సాధారణ ప్రజల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జనపాడు గ్రామం నుంచి డి.కృష్ణ అనే వ్యక్తి జనసేన రిజిస్ట్రేషన్ ప్రతిపాదనపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు.
అతడి అభ్యంతరాలపై జనసేన నుంచి వివరణ తీసుకున్న ఎన్నికల కమిషన్ వాటిని పరిశీలించింది. ఆ తర్వాత జనసేన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద, తెలంగాణ ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిందని, మరోవైపు ఆ వ్యక్తి లేవనెత్తిన అభ్యంతరాలు పార్టీ రిజిస్ట్రేషన్ను న్యాయపరంగా ఆపేందుకు అడ్డంకిగా లేవని స్పష్టం చేసింది.
అనంతరం జనసేన పార్టీని రిజిస్ట్రేషన్ చేసినట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి పార్టీకి గుర్తును కేటాయించలేదు. కేవలం పార్టీ రిజిస్ట్రేషన్ మాత్రమే అయిందని, అంత మాత్రాన తమకు కావాల్సిన గుర్తు కేటాయించాలని అడిగే అధికారం పార్టీకి లేదని పేర్కొంది.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే గుర్తు కేటాయింపులో స్వతంత్రుల కంటే ముందు జనసేన పార్టీకే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఏపీ ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దానికి సంబంధించిన దస్త్రాలను పవన్ కల్యాణ్తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు అభ్యంతరాలు లేవదీసిన కృష్ఱకు కూడా పంపింది.
దీంతో 2019 ఎన్నికలల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు మార్గం సుగమనమైంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రమోషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. అయితే అప్పటి వరకు సాధ్యమైనన్నీ సినిమాలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.