క్రియాశీలకంగా తొలి అడుగు..: పొద్దున్నే 'అంబేడ్కర్' వద్దకు పవన్, నేటి భేటీలో ఏం తేల్చబోతున్నారు?
Recommended Video
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్యాంక్బండ్పై ఉన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం 8గం.కు ఆయన జనసేన ఆఫీస్ నుంచి బయలుదేరి అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు.
నివాళులు అర్పించిన అనంతరం తిరిగి నేరుగా జనసేన కార్యాలయానికి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామిల కోసం జేఎఫ్ సి ద్వారా పోరాటం మొదలుపెట్టిన పవన్ కల్యాణ్.. నేడు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించి తమ ప్రయత్నం సఫలం కావాలని కోరుకున్నారు.
నేడే జేఎఫ్సి మీటింగ్:
నిధులకు సంబంధించి లెక్కల్ని తమకు పంపించాలని లేదా శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని పవన్ కల్యాణ్ ఇచ్చిన డెడ్ లైన్ ఈ నెల 15వ తేదీతో ముగిసిపోయింది.
డెడ్ లైన్ అయితే ముగిసింది కానీ.. పవన్ డిమాండ్ చేసినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాత్రం స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే జేఎఫ్సి మేదోమథనం ద్వారా ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇందుకోసం నేడు జేఎఫ్సి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.
ఎవరెవరు పాల్గొంటారు?:
హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ వేదికగా నేడు, రేపు పవన్ పలువురు రాజకీయ నాయకులు, మేదావులు, నిపుణులతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు మధు, నారాయణ, కాంగ్రెస్ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ తదితరులు పాల్గొంటారు. కొంతమంది ఆర్థిక, విద్య, న్యాయ నిపుణులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
బాబుపై తన వైఖరి మార్చుకుంటారా?:
ఇచ్చిన గడువు లోగా.. ఏపీ ప్రభుత్వం ఏ లెక్కలు బయటపెట్టలేదు సరికదా.. 'ప్రత్యేకంగా శ్వేతపత్రాలు గట్రా ఏమీ ఉండవు, ఇదివరకే వెబ్ సైట్ లో నిధుల ఖర్చుకు సంబంధించిన వివరాలన్ని పెట్టాం' అంటూ తేల్చేసింది. అంటే, ఇకముందు కూడా తాము ఏ లెక్కల్ని బయటపెట్టమని స్పష్టంగా చెప్పేసింది. ఇలాంటి తరుణంలో ఇన్నాళ్లు చంద్రబాబును వెనుకేసుకొచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడైన ఆయనపై తన వైఖరిని మార్చుకుంటారా? అన్నది వేచి చూడాలి.
భేటీలో ఏం తేలుస్తారు?:
నేడు, రేపు జరగబోయే భేటీలో పవన్ కల్యాణ్.. చివరాఖరికి ఏం తేల్చబోతున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. నిధుల లెక్కల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ..రెండే.. అన్నట్టుగా తయారైన నేపథ్యంలో.. ప్రత్యక్ష పోరాటానికే పవన్ మొగ్గుచూపుతారా?.. లేక ప్రత్యామ్నాయంగా మరే ప్రతిపాదనైనా ముందుకు తెస్తారా? అన్నది చూడాలి.
సమావేశ వివరాలు:
నేటి ఉదయం 10గం.-11గం. మధ్య జేఎఫ్సి సమావేశం జరగబోతోంది. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ అధ్యక్షతన గానీ, లేదా ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన గానీ ఈ సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. తొలుత పరిచయ కార్యక్రమంతో మొదలయ్యే సమావేశం.. ఆ తర్వాత అంశాలవారీగా చర్చిస్తారని తెలుస్తోంది. మధ్యాహ్నాం 2గం.కు లంచ్ బ్రేక్ ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ మీట్ అవుతారని సమాచారం.
క్రియాశీలకంగా.. తొలి అడుగు:
క్రియాశీలక
రాజకీయాల్లోకి
వచ్చిన
చాన్నాళ్ల
తర్వాత
పవన్
తొలిసారిగా
అత్యంత
క్రియాశీలకంగా
వ్యవహరిస్తున్నారు.
పవన్
ముందుకు
తెచ్చిన
జేఎఫ్సి
కార్యాచరణ
పైనే
ఆయన
భవిష్యత్తు
రాజకీయం
ఆధారపడి
ఉంది.
కాబట్టి ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలని భావిస్తున్నారు పవన్. ఇంత బలంగా ముందుకు రాబోతున్న జేఎఫ్సి పట్ల ప్రజల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఒకవేళ ఇదే గనుక విఫలమైతే మాత్రం ప్రజల్లో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం ఖాయం. కాబట్టి పవన్ జేఎఫ్సి విషయంలో పవన్ ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి.