జగన్! ఈ విషయంలో కర్ణాటకను ఫాలో అవ్వండి: పవన్ కళ్యాణ్
అమరావతి: లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి అవస్థలు పడుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
వివిధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి కోసం ఆర్థికపరమైన ఉపశమన చర్యలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. పనులకు ఆస్కారం లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, రోజు కూలీలు, హమాలీలు, కుల వృత్తిదారులు చేసుకొంటున్న క్షురకులు, రజకులు, వడ్రంగి, చేనేత కార్మికులు, ఆటో, టాక్సీ డ్రైవర్లు, స్వయం ఉపాధి కింద బైక్ మెకానిక్, ఎలక్ట్రికల్ పనులు చేసుకొనేవారు, హాకర్లు, చిన్నపాటి టిఫిన్ బళ్ళు నిర్వహించుకునే వారు... ఆర్థికంగా దెబ్బ తిన్నారని, దుర్భరమైన పరిస్థితికి లోనవుతున్నారు. వారందరికీ ఐదువేల రూపాయలకు తక్కువ కాకుండా ఆర్థిక సహాయం అందించవలసిన అవసరం వుందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఇటువంటి వారిని ఆదుకోడానికి పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 1610 కోట్ల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి అత్యవసర నిధిని ఏర్పాటుచేసి ఉపాధి కోల్పోయిన వారందరిని ఈ నిధి ద్వారా ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వారికీ, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు నిర్వహిస్తున్న వారికీ విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని నెలలపాటు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. ఆస్తి, వృత్తి పన్నుల వసూలు మినహాయింపు ఇవ్వాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కోరారు.