తేల్చుకుందాం రా, వెనుక ఏంచేస్తున్నారో తెలుసు, ఆమరణదీక్షకు సిద్ధపడే వచ్చా, లెక్కతీస్తా: బాబుకు పవన్
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ స్థాపించి, సమస్యల పైన పోరాటం చేయడం చాలా కష్టమన్నారు. ఏ పార్టీకి అయిన మనలను విమర్శించడం తేలిక అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనలా పార్టీని స్థాపించలేదన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకు వచ్చిన పార్టీ చంద్రబాబుది అన్నారు.
చదవండి: మీరు కష్టపడితే నేనే సీఎం!: శ్రీకాకుళం పర్యటనలో పవన్ కీలకవ్యాఖ్యలు, ఇంకా రాని బస్సు అందుకే కారులో
ఉత్తరాధ్రలో తాను ఓనమాలు దిద్దానని, జానపదాలు నాకు ఈ ప్రాంతం నుంచే అలవాటుపడ్డాయని చెప్పారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని తెలిసే వచ్చానని చెప్పారు. మనకు ఆర్గనైజేషన్ లేదని కొందరు చెబుతున్నారని, కానీ జనసైనిక బలం ఉందన్నారు. జనసైనికులంతా ఆర్గనైజేషనే అన్నారు. చంద్రబాబుకు ఉన్నట్లుగా మనకు హెరిటేజ్ సంస్థ లేదన్నారు. తాను వెంటనే సీఎం కావాలని కోరుకోవటం లేదన్నారు. ప్రజల కష్టాలు అర్థం చేసుకునేందుకే ఈ యాత్ర అన్నారు.
చదవండి: సముద్రస్నానం చేసిన పవన్ కళ్యాణ్, నేడే పోరాట యాత్ర ప్రారంభం
కుట్రలు, దాడులు జరిగినా కవాతు, వెనుక నుంచి మీరేం చేస్తారో తెలుసు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా కవాతు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలోను కవాతు ఉంటుందని చెప్పారు. ప్రజలు అండగా ఉంటే హోదా సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కవాతు నిర్వహిస్తామని చెప్పారు. కుట్రలు, దాడులు జరిగినా కవాతు నిర్వహిస్తామన్నారు. 175 నియోజకవర్గాల్లో కవాతు ఉంటుందని చెప్పారు. మీరు పైపైన బయటి నుంచి ఇచ్చే మర్యాద మాకు అవసరం లేదని టీడీపీని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. వెనుక నుంచి ఏం చేస్తున్నారో మాకు తెలుసునని చెప్పారు.
లెక్కలు తీస్తా, ఉన్న డబ్బును వదులుకొని రాజకీయాల్లోకి వచ్చా
ఇప్పుడు ప్రభుత్వం వారి చేతిలో ఉందని, ఖజానా వారి చేతిలో ఉందని, తాలాలు వారి చేతిలో ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అగ్రిగోల్డ్ సహా అన్ని లెక్కలు తీస్తామని చెప్పారు. తాను డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీకి జనసేనను విమర్శించడం తేలికైపోయిందన్నారు. ఉన్న డబ్బుని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. జనసేనకు జనబలం తప్ప మరేమీ లేదన్నారు. రాష్ట్రం విడిపోయాక అనుభవజ్ఞులైన నాయకులు కావాలని నాడు కోరుకున్నా, అందుకే, టీడీపీకి మద్దతిచ్చానని, ప్రత్యేకహోదా కోసమే ఆ పార్టీకి మద్దతిచ్చానని చెప్పారు.
అందుకే మద్దతు, జనసైనికులపై దాడి చేస్తే ఊరుకోం
రాష్ట్ర విభజన నేపథ్యంలో అనుభవం ఉన్న నాయకుడు కావాలని 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చానని పవన్ చెప్పారు. నేను మనుషులను నమ్ముతానని వ్యాఖ్యానించారు. చంద్రబాబును నమ్మానని అన్నారు. అందుకే మద్దతిచ్చానని చెప్పారు. తాను టీడీపీకి మద్దతిచ్చింది కూడా అభివృద్ధి కోసమే అన్నారు. తాను కాంట్రాక్టులు, పదవులు కోరలేదన్నారు. కానీ జనసేన సైనికులపై దాడి కోసం కాదన్నారు. దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
బానిసలా ఉండాలా, బాంచెన్ కాల్మొక్తా అనాలా, ఇష్టపడి సపోర్ట్ చేశా
నీకు మద్దతిచ్చినందుకు బానిసలా ఉండాలా అని పవన్ టీడీపిని ప్రశ్నించారు. బాంచెన్ కాల్మొక్త అనాలా అన్నారు. తాను చంద్రబాబును ఇష్టపడి సపోర్ట్ చేశానని, బయపడి చేయలేదన్నారు. అభివృద్ధి చేస్తారని సపోర్ట్ చేశానని అన్నారు. తాను సాటి మనిషి కష్టాలు తీర్చాలని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తానో లేదే తెలియదు కానీ మోసం చేయనని చెప్పారు. నిజాయితీగా మాట్లాడుతానన్నారు.
బతకండి బతకనీయండి.. లేదంటే చేతులు కట్టుకొని కూర్చోను
బతకండి.. బతకనీయండి అని పవన్ పిలుపునిచ్చారు. మేమే బతుకుతాం అంటే మాత్రం నేను చేతులు కట్టుకొని కూర్చోలేనని చెప్పారు. తాను అలా కూర్చునే వ్యక్తిని కాదన్నారు. నా వెన్నంటి ఉండి పార్టీ కోసం పని చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు అన్నారు. సాటి మనిషి కష్టాలు తీర్చడమే మాకు ముఖ్యమన్నారు. జనసేనను వైసీపీ, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు తిడుతున్నాయన్నారు. అసలు మేం ఏ పక్షం కాదని, ప్రజల పక్షం అన్నారు. మీరిస్తే మేం తీసుకోమని, మేమిస్తే మీరు తీసుకోవాలన్నారు.
నన్ను నమ్మమని చంద్రబాబు చెప్పారు
చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇవన్నీ సాధ్యపడతాయా అని తాను ఆ రోజే అడిగానని పవన్ అన్నారు. నేను అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. అందుకే నమ్మానని తెలిపారు. హామీలు ఎలా సాధ్యమవుతాయని కూడా అడిగానని పవన్ చెప్పారు. నాకు అనుభవం ఉంది, నేను చేస్తానని చెప్పారని, ఆయనను నమ్మడానికి తనకు ప్రతిదానికి కారణం ఉందని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో ఆరువందల హామీలు ఇచ్చారని, వేటిని అమలు చేయలేదన్నారు.
తేల్చుకుందాం రండి, ఆమరణ దీక్షకు సిద్ధపడే వచ్చా
అసలు తొలి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడింది ఎవరు అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని పవన్ కళ్యాణ్ టీడీపీకి సవాల్ విసిరారు. ఏడు సిద్ధాంతాలతో పార్టీని స్థాపించిన వ్యక్తిని అన్నారు. ఎవరికీ భయపడేది లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటం చేయాలో చెప్పాలని అడిగారు. హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడే వచ్చానని చెప్పారు. టీడీపీది ధర్మపోరాటమా, జనసేనది ధర్మపోరాటమా ప్రజలు తేలుస్తారన్నారు. హోదాపై ధర్మపోరాటం ఎవరిదో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రండి అన్నారు. హోదాపై చంద్రబాబు మొసలి కన్నీరు కార్చవద్దని సూచించారు.
పవన్ సీఎం కావాలని అరిస్తే కాను, నేను కష్టపడుతున్నా మీరు కష్టపడండి
పవన్ మాట్లాడుతుండగా చాలామంది అభిమానులు, కార్యకర్తలు పవన్.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దానికి ఆయన మీరు అరిస్తే నేను సీఎం కానని చెప్పారు. నేను కష్టపడుతున్నానని, కష్టపడి పైకి ఎదుగుదామని అభిప్రాయపడ్డారు. మీరు కూడా కష్టపడి నన్ను సీఎంను చేయండన్నారు. ఓ సమయంలో ఇతర పార్టీల మధ్య ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతూ లోగుట్టు పేరుమాళ్లకెరుక అన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించే వరకు మీ ఆశీస్సులు కావాలన్నారు.
బీజేపీ చాలా తప్పులు చేసింది
బీజేపీ చాలా తప్పులు చేసిందని పవన్ అన్నారు. బీజేపీకి నేను ఒక్కటే చెబుతున్నానని, తనపై ఎలాంటి కేసులు లేవని, తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. నేను భయపడటానికి ఏమీ లేదన్నారు. చట్టసభల్లో ఇచ్చిన మాటను తప్పినప్పుడు ప్రజలు కూడా చట్టాలను పట్టించుకోరన్నారు. తనది భయపడే వ్యక్తిత్వం కాదన్నారు.
లేడీకి లేచిందే పరుగులా.. సీఎం అయితేనే సమస్యలు పరిష్కరిస్తాననడం లేదు
తనకు రాజకీయాలు తెలుసునని పవన్ చెప్పారు. ముఖ్యమంత్రిని అయితేనే సమస్యలు పరిష్కరిస్తానని తాను చెప్పడం లేదని జగన్ను ఉద్దేశించి అన్నారు. లేడికి లేచిందే పరుగులా సీఎం కావాలని కోరుకోవడం లేదన్నారు. నేను శ్రమిస్తానని, కష్టపడుతానని, సాటి మనిషి కష్టం తెలుసుకుంటానని చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదన్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటానని చెప్పారు.
ఎవరో ఆడిస్తే ఆడే బొమ్మనా?
తాను బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని టీడీపీ అంటోందని, కానీ ప్రత్యేక హోదా గురించి పదేపదే మాట మార్చింది చంద్రబాబు అని పవన్ దుయ్యబట్టారు. కేంద్రానికి భయపడేందుకు తన పైన ఎలాంటి కేసులు లేవన్నారు. ఎవరో ఆడిస్తే ఆడే బొమ్మను తాను కాదన్నారు. పవన్ ఏమైనా బొమ్మనా అని ప్రశ్నిచారు.