మీ బెదిరింపుకు భయపడను, మీపై నమ్మకం కోల్పోయా, చంద్రబాబు గురించి వసుంధర అడిగారు: పవన్
శ్రీకాకుళం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం ఇచ్ఛాపురంలో జన పోరాట యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై, టీడీపీపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరోక్ష చురకలు అంటించారు. తాను సీఎం అయితేనే అన్నీ చేస్తానని చెప్పనని వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు కానీ ప్రజలను మోసం మాత్రం చేయనని చెప్పారు. జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తనకు ఓ బాధ ఉందన్నారు. నరేంద్ర మోడీ నాడు పార్లమెంటుకు మొక్కి లోపలకు అడుగుపెడితే ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చుతారని భావించానని చెప్పారు. ప్రజలంతా ఏకమైతే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు.
మీరు కష్టపడితే నేనే సీఎం!: శ్రీకాకుళం పర్యటనలో పవన్ కీలకవ్యాఖ్యలు, ఇంకా రాని బస్సు అందుకే కారులో
నేను గెలుస్తానో లేదో తెలియదు కానీ
తాను సమస్యలపై నిజాయితీగా మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు కానీ మోసం మాత్రం చేయనని చెప్పారు. రైతు రుణమాఫీ సహా ఏ హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఇన్ని హామీలు ఇస్తున్నారు ఎలా నెరవేరుస్తారని రాజస్థాన్ సీఎం వసుంధర రాజే తనను అడిగారని చెప్పారు.
పదవులు కావాలనుకుంటే అప్పుడే తీసుకునేవాడిని
డబ్బులు సంపాదించేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని, ఉన్న డబ్బులు పోయినా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తనకు టీడీపీ, ఇతర పార్టీలు వస్తే తీసుకునే వాడినన్నారు. 2009 ఎన్నికల్లోనే నేను ఎమ్మెల్యేగానో, ఎంపీగానో అయ్యేవాడినన్నారు. 2014 ఎన్నికల్లోను నేను చంద్రబాబుకు మద్దతివ్వడానికి కారణం ఉందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనుభవం ఉన్న నాయకుడు కావాలని టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు.
మీ బెదిరింపులకు నేను భయపడను
ప్రత్యేక హోదా గురించి మొట్టమొదటిసారి నిలదీసింది జనసేన మాత్రమేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ టీడీపీ మాత్రం ప్యాకేజీకి స్వాగతించిందన్నారు. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నేను నమ్మిన ప్రజలను మోసం చేయనని చెప్పారు. మీ బెదిరింపులకు నేను భయపడనని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతించి, ఇప్పుడు మీరు యూ టర్న్ తీసుకున్నారన్నారు. అమరావతిలో బీజేపీ నేతలకు సన్మానాలు చేశారన్నారు. ఇప్పుడు బీజేపీకి పవన్ కళ్యాణ్కు లింక్ పెడుతున్నారన్నారు. బీజేపీ నాకు బంధువేమీ కాదన్నారు.
మీ మీద నాకు నమ్మకం పోయింది
ప్యాకేజీ పైన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ వేసేదాకా చంద్రబాబు మేల్కొనలేదని పవన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్నో రకాలుగా మాటలు మార్చారని మండిపడ్డారు. హోదా, ప్యాకేజీపై ఇన్ని రకాల మాటలు మాట్లాడిన మీ మీద నాకు నమ్మకం పోయిందని చెప్పారు. అసలు బీజేపీకి లొంగిపోతోందని మీరన్నారు. హోదాపై ఇన్నిసార్లు మాట మార్చడం వల్ల మీపై నమ్మకం పోయిందన్నారు.