‘బీజేపీతో కలిస్తే పరిస్థితి అలా.. అప్పుడు వైసీపీ నేతలు నాతో..పేర్లు బయటపెడితే వాళ్ల ముఖం ఎక్కడో‘
రాయలసీమ పర్యటనలో భాగంగా తిరుపతిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం ఉదయం కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతో పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సాధారణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడుతూ..
తిరుమలలో మత మార్పిడులు.. ముఖ్యమంత్రికి తెలియవా? పవన్ కల్యాణ్ ఫైర్
తెలుగు మీడియంపై వక్రీకరణ
బ్రహ్మంగారి లాంటి ఎందరో మహానుభావులు పుట్టిన నేల రాయలసీమ. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన వారు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయం. నేను ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదు. నేను తెలుగు భాషను పరిరక్షించమన్నాను. నా వ్యాఖ్యలు వక్రీకరించి వైసీపీ వాళ్లు తప్పుగా ప్రచారం చేశారు. నేను రామ అంటే కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. ఆంగ్ల భాష అవసరమే. నా బిడ్డలు తెలుగు మీడియం చదువుకొనేందుకు ఆప్షన్ ఇవ్వాలని తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఏపీలో పలు భాషల్లో బోధిస్తున్నారు అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇతర భాషలను కూడా
ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఒరియా, తమిళం, కన్నడ భాషలకు సంబంధించిన మాధ్యమాలు ఉన్నాయి. అయితే ఈ భాషల మాధ్యమాన్ని తొలగించి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నారా? లేక తెలుగు భాషను చులకనగా చేసి మన భాష స్థానంలో ఆంగ్ల భాషను ప్రవేశపెడుతున్నారనే విషయంపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
హిందు మతం గురించి మాట్లాడితే..
హిందు మతం గురించి మాట్లాడమని కొందరు నాతో చర్చించారు. హిందు ధర్మం గురించి నేను తప్పుకుండా మాట్లాడుతాను. కడప దర్గాకు వెళ్లి జై భవాని అనకూడదు. మెదక్ చర్చికి వెళ్లి జై శ్రీరాం అనకూడదు. అలాగే హిందూ దేవాలయాల వద్దకు వెళ్లి జీసస్ అనరు. అలా అంటే ధర్మ విరుద్ధం. విజయవాడలో కృష్ణా పుష్కర ఘాట్లో మాత మార్పిడి జరిగింది. ఎవరి అండ చూసుకొని 40 మంది మతాన్ని మార్చారు. ఈ విషయం సీఎంకు తెలియదా? సామూహిక మతమార్పిడి జరిగితే కళ్లు కనిపించడం లేదా? అని పవన్ కల్యాణ్ అన్నారు.
నేను భయపడను..
హిందు మతానికి దెబ్బ తగులుతుంటే ఏం చేస్తున్నారు? హిందూ మతం గురించి నా మాటలను వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేస్తున్నారు. త్వరలోనే వీడియోను రిలీజ్ చేస్తాను. దాని గురించి వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. హిందూ ధర్మం గురించి మాట్లాడటానికి భయపడను అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లపై పవన్ కల్యాణ్ స్పందించారు. తాను అంశాల వారీగా మాట్లాడుతుంటే వారు ఇష్టం వచ్చినట్టు నాపై అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు.
బీజేపీతో కలిస్తే మరోలా ఉండేది
నేను బీజేపీతో కలిస్తే వైసీపీ నేతల పరిస్థితి మరోలా ఉండేది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వారితో విభేదించాను. తెలుగుదేశంతో కలిసి ఉంటే వారితో కలిసి పోటీ చేసేవాడిని. ఓ సమయంలో వైసీపీ నాయకులు నాతో చాలా రకాలు సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు చేస్తే తాను సున్నితంగా తిరస్కరించాను. వారి పేర్లు బయటపడితే ముఖం ఎక్కడ పెట్టుకొంటారో తెలియదు అని పవన్ కల్యాణ్ అని అన్నారు.
అమిత్ షా అంటే భయం
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంటే వైసీపీ నేతలకు భయం.. ఆయన అంటే నాకు గౌరవం అందుకే వారు జనసేనను బీజేపీలో విలీనం చేస్తున్నారనే అసత్యపు ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా కోసమే వారితో విభేదించానని, బీజేపీకి ఎప్పుడూ తాను దూరం కాలేదు. అమిత్ షాను కలిసి తర్వాత తన స్వరం మారిందనే అంశంలో అర్ధం లేదు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.