వారు ఔట్.. పవన్ కళ్యాణ్ ద్విముఖ వ్యూహం, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: మాయావతితో భేటీ!
లక్నో/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హుటాహుటినా ఉత్తర ప్రదేశ్కు చేరుకున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండానే ఆయన లక్నోకు బయలుదేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు. ఇందుకోసం నవ్యాంధ్రలో జోరుగా పర్యటిస్తున్నారు.
ఆయన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్లతో చర్చలు జరిపేందుకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. మరికొందరు ముఖ్య నేతలతోను ఆయన సమావేశం కానున్నారని సమాచారం. పరిణామాలు చూస్తుంటే ఆయన ద్విముఖ వ్యూహంతో వెళ్తున్నారని తెలుస్తోంది.
థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలా?
పవన్ కళ్యాణ్ తృతీయ కూటమి కోసం చర్చలు జరిపేందుకు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఏపీలో చక్రం తిప్పడంతో పాటు జాతీయ స్థాయిలో కీలక నేతలతో కలిసి ఢిల్లీలోను కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ తన సత్తా నిరూపించుకుంటే జాతీయ నేతల దృష్టిలో పడతారని అంటున్నారు. ఇప్పటికే పవన్కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇమేజ్ అందరికీ తెలిసిందే.
2019లోను రాహుల్ గాంధీతోనే! తెలంగాణలో ప్రచారం చేస్తా, కానీ: చంద్రబాబు ఊహించని షాక్లు
చంద్రబాబు, కేసీఆర్ దారిలో థర్డ్ ఫ్రంట్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ గతంలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ఆయన పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర చోట్లకు వెళ్లి మమతా బెనర్జీ, దేవేగౌడలను కూడా కలిశారు. మరోవైపు, చంద్రబాబు కూడా తొలుత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమి కడతామని చెప్పారు. అయితే ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వ్యతిరేక కూటమి అయిన కాంగ్రెస్లో చేరే అవకాశముంది. ఇప్పుడు కేసీఆర్ ముందస్తు హడావుడిలో, చంద్రబాబు కాంగ్రెస్ వైపు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ వారి దారిలో థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
కేసీఆర్ ఆలోచన.. పవన్ ముందుకు
తెలంగాణలో కేసీఆర్ పాలన పట్ల పవన్ కళ్యాణ్ కొంత సానుకూలంగా ఉన్నారు. పార్టీ నిర్మాణం కాకపోవడంతో పాటు, కేసీఆర్ పట్ల ఆయన సానుకూలంగా ఉన్నందునే తెలంగాణలో వచ్చిన ఎన్నికల్లో బరిలోకి దిగడం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో గతంలో కేసీఆర్ తలపెట్టిన థర్డ్ ఫ్రంట్ ఆలోచనను ఇప్పుడు పవన్ ముందుకు తీసుకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఇప్పుడు ముందస్తు హడావుడిలో ఉన్నారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
మాయావతి, అఖిలేష్ యాదవ్, ఇతర జాతీయస్థాయి నేతలను కలవడం ద్వారా పవన్ కళ్యాణ్ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. మాయావతి దళిత నాయకురాలిగా ఎదిగారు. జాతీయస్థాయిలో ఆ పార్టీకి ఓటు బ్యాంకు ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోను ఉంది. అఖిలేష్ పార్టీకి ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ ఆ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ మాయావతితో చర్చల కోసమే వెళ్లారని అంటున్నారు. థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలతో పాటు వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఆమె లేదా ఆ వర్గం మద్దతు కూడా దక్కించుకునే ప్రయత్నాలు కావొచ్చని అంటున్నారు. తద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా పవన్ ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.
లెఫ్ట్తో జతకడుతూ బీజేపీకి దూరమని ఇప్పటికే సంకేతాలు
పవన్ కళ్యాణ్కు ప్రధాని మోడీ అంటే ప్రత్యేక అభిమానం, గౌరవం. అయితే తాను ప్రజా సమస్యలపై ఏ ప్రభుత్వాన్ని అయినా, ఏ పార్టీని అయినా నిలదీస్తానని చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఏపీ, తెలంగాణలలో లెఫ్ట్ పార్టీలతో జతకడతానని చెప్పడం ద్వారా, తెలంగాణలో సీపీఎంతో కలిసి వెళ్లే ప్రయత్నాలు చేస్తుండటం ద్వారా తాను బీజేపీకి దూరం అని చెప్పకనే చెప్పారు. టీడీపీ నేతలు బీజేపీ ఆడిస్తున్న నేతగా ఆరోపణలు చేస్తున్నప్పటికీ లెఫ్ట్ పార్టీలకు దగ్గరగా ఉంటూ పవన్ మాత్రం తాను బీజేపీకి దూరమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. ఇది మాయావతి, అఖిలేష్ యాదవ్ల మద్దతుకు ఉపకరిస్తుంది. పవన్ యూపీ పర్యటన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
Recommended Video