భూమనపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ .. తోక జాడిస్తే నార తీసి కూర్చోబెడతా
Recommended Video
ఎన్నికల ప్రచారంలో మెగా బ్రదర్స్ మాటల తూటాలు పేలుస్తున్నారు. మొన్నటికి మొన్న నేను నాన్ లోకల్ అనే రాస్కెల్ ఎవరు ? యూజ్లెస్ ఫెలోస్ , వెధవలు అంటూ మెగా బ్రదర్ నాగబాబు వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేసి మాట్లాడితే, ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి పై షాకింగ్ కామెంట్ చేశారు. జనసేన జోలికొస్తే ఊరుకోం అని తేల్చి చెప్పారు.నార తీసి కూర్చోబెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు .
ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ (ఫొటోలు)
తోక జాడిస్తే నార తీస్తానని వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిని హెచ్చరించిన పవన్
వైసీపీ తిరుపతి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ ఇష్టం వచ్చినట్టు రౌడీయిజం చేస్తే ఊరుకోటానికి తాను చిరంజీవిని కాదని ఫైర్ అయ్యారు. ఒక్క జనసైనికుడిపై చేయి పడినా, ఒక్క ఆడపడుచును ఇబ్బంది పెట్టినా చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. తోక జాడిస్తే నారతీసి కూర్చోబెడతానని వార్నింగ్ ఇచ్చారు.
దౌర్జన్యం చేసినా సహించటానికి తానుచిరంజీవిని కాదన్న పవన్
ఇది 2009 కాదని, 2019 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తాను చిరంజీవిని కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని చెప్పారు. 2009 ఎన్నికల్లో చిరంజీవిలాంటి ఓ బలమైన వ్యక్తిపై కెన్సెస్ హోటల్ వేదికగా కరుణాకర్ రెడ్డి రౌడీ మూక దౌర్జన్యానికి దిగిందని చెప్పిన పవన్ , ఆ ఘటనను తాను ఎన్నటికీ మర్చిపోనని చెప్పి గట్టిగా హెచ్చరిక జారీ చేశారు.
తిరుపతిలో ప్రతి మహిళా మాయావతిగా మారి రౌడి అభ్యర్థులకు బుద్ధి చెప్పాలి
జగన్ కానీ, కరుణాకర్ రెడ్డిలాంటి రౌడీలు ఉత్తరప్రదేశ్ లో వీధికొకరు ఉంటారని... అలాంటా రౌడీలను బీఎస్పీ అధినేత్రి మాయావతి రుద్రకాళిలా చీల్చిచెండాడారని పవన్ అన్నారు. కరుణాకర్ రెడ్డిని ఓడించడానికి తిరుపతి నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచు ఓ మాయావతిలా మారాలని పిలుపునిచ్చారు. తిరుపతి వేదికగా జరిగిన సభలో ఆయన వైసీపీ నేతలపై, జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
తిరుపతి అభివృద్ధి జనసేనతోనే సాధ్యం అన్న పవన్
తమ పార్టీని గెలిపిస్తే తప్పక తిరుపతిని ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల పరిపాలనా మండలిగా తీర్చి దిద్దుతానని చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్. టీడీపీ అభ్యర్థిని, వైసీపీ అభ్యర్థిని ఓడించి తిరుపతిలో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాయావతితో కలిసి ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ సభా ముఖంగా మాయావతిని ప్రశంసించారు.