మూడు ముక్కలాట: బాబుతో పవన్ కళ్యాణ్, జగన్కు బ్రేక్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూస్వాధీనం కోసం జారీ చేసిన జీవోపై పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్న రెండు గ్రామాల రైతులకు మెరుగైన ప్యాకేజీ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఆయన చంద్రబాబును కలుస్తారని అంటున్నారు.
రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటే తాను వ్యతిరేకిస్తానని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించిన విషయం ప్రభుత్వం జారీ చేసిన జీవోతో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తొలుత భూసేకరణ విధానాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రైతులకు ఉత్తమమైన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతాల్లో పర్యటించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వ భూసేకరణ విధానాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత హైదరాబాదులో ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ ప్యాకేజీ మాట ఎత్తారు.
తన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది, రైతులకు న్యాయం చేసినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఉత్తమ ప్యాకేజీని సాధించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఆందోళనకు దిగితే అది ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఉపకరించే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ ఆందోళనను ఆసరాగా చేసుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భారీ యెత్తున ఆందోళనకు ముందుకు రావచ్చు. అదే జరిగితే అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జనసేన పార్టీకి ఇంకా నిర్మాణం లేకపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా అది తయారయ్యే అవకాశాలు లేవు. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి కూడా వీలు కాదు. ఈ స్థితిలో జగన్ బలపడకుండా ఉండాలంటే భూసేకరణ సమస్యను చంద్రబాబుతో ఉభయతారకంగా పరిష్కరించుకోవడం మంచిదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. రైతులను సంతృప్తి పరిచే ప్యాకేజీని సాధించడం ద్వారా ప్రజలకు నచ్చజెప్పవచ్చుననే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తన మాట కూడా నెగ్గించుకున్నట్లు ఉంటుంది. తనపై ప్రజల్లో ఉన్న సానుకూల వైఖరి ప్రజల్లో అలాగే ఉండిపోతుందని ఆయన భావిస్తూ ఉండవచ్చు.
కాగా, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) తెలుగుదేశం పార్టీకి అండగా నిలువాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ కలిసి వచ్చినా, రాకపోయినా పవన్ కళ్యాణ్ టీడీపీతోనే ఉంటారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.