ప్రాణాపాయస్థితిలోని శ్రీజను కలవనున్న పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రాణాపాయస్థితిలో ఉన్న శ్రీజను రేపు కలవాలని నిర్ణయించుకున్నారు. 13 ఏళ్ల శ్రీజ ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకు పవన్ కళ్యాణ్ను చూడాలని ఉందని శ్రీజ తెలిపిన విషయం తెలిసిందే. దీనిని మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో పవన్ శ్రీజను రేపు చూసేందుకు ఖమ్మం వెళ్తున్నారు. శ్రీజ వయస్సు పదమూడేళ్లు.
మృత్యువుతో పోరాడుతున్న చిన్నారుల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తీరుస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ వారు మాట్లాడారు. మృత్యువుతో పోరాడుతున్న చిన్నారుల కోరికలు తీరుస్తున్న తమ సంస్థ కార్యక్రమాల పైన ప్రముఖులు, సినీ తారలు స్పందించాలని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ పుష్పాదేవి జైన్ సూచించారు.
ప్రభుత్వం, ప్రయివేటు, కార్పోరేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న చిన్నారుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి కోరికలను తీరుస్తున్నామని తెలిపారు. ఇటీవల కేన్సర్తో బాధపడుతున్న చిన్నారి శరత్ వద్దకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తీసుకు వెళ్లామని చెప్పారు. శరత్ను కెసిఆర్ కలిశారు కూడా.
సినీ నటుడు పవన్ కళ్యాణ్ను కలుసుకోవాలన్న కోరిక శ్రీజకు ఉందని చెప్పారు. దీని పైన పవన్ కళ్యాణ్ స్పందించారన్నారు. కాగా, ఈ విషయాన్ని వారు పవన్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో పవన్ శ్రీజను కలవాలని నిర్ణయించుకున్నారు.
కాగా, పదేళ్ల బాలుడు సాదిక్ చేతిలో లాఠీతో దర్జాగా నడుస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ కుర్చీలో కూర్చుని ఫైల్స్ చూస్తూ గడిపిన విషయం తెలిసిందే. పెద్దయ్యాక ఐపీఎస్ అయ్యి రౌడీలు, గూండాల పని పట్టాలన్నది ఈ కుర్రాడి జీవిత లక్ష్యమని చెప్పాడు.గత ఐదు నెలలుగా బ్లడ్ కేన్సర్ ఈ బాలుడి జీవితాన్ని కొద్దికొద్దిగా కబళిస్తోంది.
ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారి చివరి కోరికలు తీర్చే ‘మేక్ ఏ విష్' సంస్థ హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి సాధిక్ గురించి తెలిపింది. ఆయన పెద్దమనసు చేసుకుని అతడి కోరికను తీర్చారు. దాంతో నగర కొత్వాల్గా బాధ్యతలు స్వీకరించి కమిషనర్ కుర్చీలో కూర్చున్నాడు. కమిషనర్ మహేందర్ రెడ్డి సహా పోలీసులంతా సాదిక్కు పోలీసు వందనం సమర్పించారు.
సాదిక్ బ్లడ్ కేన్సర్ను జయించి, ఐపీఎస్ కావాలని మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. సాదిక్ మామ హెడ్ కానిస్టేబుల్ అని, మేనమామ ఆర్మీలో పనిచేస్తున్నాడని, మరో ఇద్దరు బంధువులు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని, అందుకే సాదిక్ ఎప్పుడూ తాను పోలీస్ కమిషనర్ అవుతాననేవాడని అతడి తండ్రి రహీముద్దీన్ గద్గద స్వరంతో చెప్పారు. ఆయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని ఓ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో పనిచేస్తున్నారు.