చిరంజీవి పక్కనున్న వారే అలా చేశారు, నేను చెప్తే అర్థం కావట్లేదా: నాయకులపై పవన్ కళ్యాణ్ అసహనం
అమరావతి: ఏపీలో రాజకీయాలు కుటుంబాల చేతుల్లో నలిగిపోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం అన్నారు. ఇందిరా గాంధీ మాదిరిగా ఒత్తిడిని తట్టుకునే నాయకులు మన పార్టీకి కావాలని చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కొన్ని స్థానాలలో పోటీ చేయాలని తాను భావించానని చెప్పారు. కానీ కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తే పార్టీ బలోపేతం కాదని ఆగిపోయానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ కొత్త ప్రణాళిక: క్షేత్ర ఫర్ జనసేన ఏర్పాటు, ఏం చేస్తారంటే?
నాడు తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది కాబట్టే గెలిచాయని చెప్పారు. విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ అధ్యక్షతన కడప జిల్లా నాయకులు, కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేనాని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేశారు.
ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్నారు
చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం పార్టీ చెబుతోందని, జగన్మోహన్ రెడ్డిని ఓసారి ముఖ్యమంత్రి చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోందని పవన్ విమర్శలు గుప్పించారు. ఇలా ముఖ్యమంత్రి పదవి కోరుకునే వారికి చిత్తశుద్ధి ఉండదని చెప్పారు.
చిరంజీవిని పక్కనున్నవారే నిరాశపరిచారు
ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతో తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తే పక్కన ఉన్న వారే నిరాశపరిచారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో తెలంగాణ భావజాలం బలపడటాన్ని తాను గమనించానని చెప్పారు. ఇది మార్పునకు సంకేతంగా తాను భావించానని చెప్పారు.
తెలంగాణ పరిస్థితులే రాయలసీమలో
ఇప్పుడు రాయలసీమలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని చెప్పారు. తాను 2003లోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని చెప్పారు. దృఢమైన భావజాలంతోనే జనసేనకు రూపకల్పన చేశానని చెప్పారు. వ్యవస్థను బలపర్చడానికి వచ్చాను తప్ప, తాను వ్యక్తిగా బలపడటానికి మాత్రం రాలేదని చెప్పారు.
పోరాటం చేసేవారికి గెలుపు
పోరాటం చేసే వారికే గెలుపు సిద్ధిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యమంత్రిగా పని చేయాలని ఉందని ఓ పక్క జగన్ అంటుంటే, మళ్లీ సీఎంను చేయమని చంద్రబాబు అడుగుతున్నారని విమర్శించారు. అధికారం కోసం వచ్చే వాళ్లకు ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండదని చెప్పారు.
రాజకీయాలు అంటే నాకు వ్యాపారం కాదు
తనకు రాజకీయాలు అంటే తనకు వ్యాపారం కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. డబ్బు సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేసారు. రాజకీయాల్లో మార్పు కోసమే జనసేనను స్థాపించానని అన్నారు. 2003 నుంచి డబ్బు ప్రభావిత రాజకీయాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కొత్త పార్టీ కాబట్టి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయని చెప్పారు. అలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనే సత్తా, ధైర్యం జనసేన శ్రేణులకు ఉన్నాయని చెప్పారు.
జనసైనికులు నాయకులుగా మారాలి
ఏపీలో రాజకీయాలు కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసైనికులు అందరూ నాయకులుగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనసేనకు మహిళలు, యువత అండగా ఉన్నారని చెప్పారు. జనసేన కవాతులో లక్షలాది మంది పాల్గొన్నారని చెప్పారు. సంక్రాంతి తర్వాత కమిటీలు వేయడానికి సమాయత్తం అవుతున్నానని చెప్పారు. కడప జిల్లాలోని రాజంపేట, కడప పార్లమెంటుస్థాయి కమిటీలు ఉంటాయని పవన్ చెప్పారు. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా వ్యవస్థలో మార్పు కోసం జనసైనికులు కృషి చేయాలన్నారు. యువతను రాజకీయ శక్తిగా మార్చే బాధ్యత తనదే అన్నారు.
నేను పార్టీ బలం గురించి అధ్యయనం చేసేందుకు కమిటీలు వేస్తే కొంతమంది ఏదో అధికారం ఇచ్చినట్లుగా బయట ప్రవర్తిస్తున్నారని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. నేను మాట్లాడేది జనసైనికులకు అర్థమవుతోందని, కానీ కొంతమంది నాయకులకు అర్థం కావడం లేదన్నారు. పోరాటం ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు అయి, మార్పు తీసుకు రాకుంటే మనకు ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా ఉపయోగం లేదన్నారు. నేను ఓ ఫారం ఇస్తున్నానని, మీరు ఒక మూడు రోజుల్లో మీ నియోజకవర్గాల్లో ఎవరు బాగా పని చేస్తున్నారనే విషయం రాసి ఇవ్వండని, కు, మతాలు అనే తేడా లేకుండా మీ మాటను గౌరవించి వారికి బాధ్యతలు అప్పగిస్తానని, మీలోంచి ఒక 5 మందిని మీరే నిర్ణయించుకోండని, ఒక కమిటీని వేసి నాకు అందిస్తే, నేను మీ మీద ఉన్న నమ్మకంతో గుడ్డిగా బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు. కానీ బాగా పని చేయాలన్నారు. నాయకులు ఉండొచ్చు.. పోవొచ్చు.. కానీ జనసైనికులు మాత్రమే ఎప్పుడూ ఉంటారన్నారు.