పవన్ కల్యాణ్, జేపీ నడ్డా కీ డిస్కషన్స్, రాజధాని తరలింపు, ప్రభుత్వ వేధింపులు, కార్యాచరణపై ఫోకస్
రాజధాని తరలింపు, రైతులను జగన్ ప్రభుత్వం వేధిస్తోందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివరించారు. బీజేపీ హైకమాండ్ పిలుపుతో శనివారం ఢిల్లీ వెళ్లిన.. పవన్ కల్యాణ్ సోమవారం నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు.
బీజేపీతో జనసేన కలిసి పనిచేయడంపై కూడా డిస్కస్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అమరావతి రాజధాని తరలింపు, జగన్ ప్రభుత్వం రైతులను వేధిస్తున్న అంశాలను నడ్డా దృష్టికి పవన్ కల్యాణ్ తీసుకొచ్చారు. ఏపీలో ప్రభుత్వ చర్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. అమరావతి రాజధానికి ప్రధాని శంకుస్థాపన చేశారని, దానిని ఎలా మారుస్తారని పవన్ అనగా.. దీనిపై బీజేపీ ఏపీ కార్యవర్గం తీర్మానం చేసిందని నడ్డా తెలిపినట్టు సమాచారం.
ఏపీ రాజధాని తరలింపుపై చివరగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడాలని పవన్కు నడ్డా సూచించారు. విభజన హామీలను నెరవేర్చే అమిత్ షా అయినందున.. ఆయనతో చర్చించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఏపీ బీజేపీ నేతలు సోమువీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వ్యక్తిగత వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవద్దని నడ్డా సూచించారు. బుధవారం ప్రధాని నరంద్ర మోడీ, అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యే అవకాశం ఉంది.
బీజేపీతో కలిసి పనిచేయాలని జనసేనాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇరు పార్టీలో అమరావతిలో పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ, అమిత్ షాతో భేటీలో కలిసి పనిచేసే అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది.