'తెరపైకి బాబు కొత్త డ్రామా, మోడీ అబ్బ సొత్తు కాదు, పవన్తో కలిసి పెద్ద ఉద్యమం'
Recommended Video
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, బీజేపీతో ఇన్నాళ్లు లాలూచీ పడి, ఇప్పుడు తానే ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు సోమవారం మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్కు 2+2 భద్రత, ఇక సమయం చూసి 'ఆమరణ'పై అడుగు
ఏపీకి రాజధాని లేదని, విద్యాసంస్థలు లేవని, నిధులు లేవని, రైల్వే జోన్ లేదని, ప్యాకేజీ లేదని, జాతీయ విద్యా సంస్థలు ఇస్తామని చెప్పినప్పటికీ నత్తనడకన సాగుతోందని సీపీఎం మధు అన్నారు. విభజన చట్టంలో చెప్పినవి ఏవీ జరగడం లేదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని బీజేపీ, హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తేలేని టీడీపీ, దీనిపై తీవ్ర పోరాటం చేయాల్సిన వైసీపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని ఆరోపించారు.
తీవ్ర ఉద్యమం చేయాలని నిర్ణయం
ఈ నేపథ్యంలో జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి తీవ్ర ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు మధు తెలిపారు. విభజన హామీల విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లల్లా ఏపీ పరిస్థితి ఉందన్నారు. మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. రాయలసీమతో ప్రారంభించి ప్రకాశం, ఉత్తరాంధ్రలో ఉద్యమిస్తామన్నారు.
టీడీపీ, వైసీపీలు మోడీకి వత్తాసు
బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో పెద్ద డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. మోడీ, అమిత్ షాలు ఢిల్లీలో ఉండి ఏపీకి అన్యాయం చేస్తే, టీడీపీ, వైసీపీలు మోడీకి వత్తాసు పలికి, అన్ని ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచి ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోడీతో లాలూచీ పడ్డారని చంద్రబాబు, జగన్లపై మండిపడ్డారు.
చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు
చంద్రబాబు ఈ మధ్య కొత్త డ్రామాకు తెరలేపారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. తనను ఎవరైనా విమర్శిస్తే ఏపీ కోసం పాటుపడుతున్న తనను బలహీనపరుస్తున్నారని క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు లాలూచీ పడి ఇప్పుడు కేంద్రంపై పోరాడినట్లు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
ఫిరాయింపు రాజకీయాలు
ఏపీలో అవినీతి రాజకీయాలు, ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయని రామకృష్ణ అన్నారు. రాజకీయాలను భ్రష్టు పట్టించారన్నారు. తాము ప్రజల అజెండా ముందుకు తెస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమవైపు చూసేలా ముందుకు సాగుతామన్నారు. విభజన హామీలు మోడీ అబ్బ సొత్తు కాదని, పార్లమెంటులో చేసిన చట్టాలే అమలు చేయకుంటే ప్రజలకు నమ్మకం పోతుందన్నారు.
ఏపీకి హోదా సాధించి తీరుతం
28న విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా సాధిస్తామని చెప్పారు. ఏప్రిల్ నెలలో మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. తమకు అండగా ఉండే రాజకీయాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.