సీఎం సాయం సరిపోలేదు: గవర్నర్కు పవన్ ఫిర్యాదు, అప్పటిదాకా ఎన్నికల్లేవు: చంద్రబాబు
హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలిశారు. టిట్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. బాధితుల తరఫున ఆయన గవర్నర్ను కలిసి పరిస్థితిని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మీరు పొగిడారు కానీ, అసలు విషయం ఇదీ!: బాబుపై గవర్నర్కు పవన్ ఫిర్యాదు!!
టిట్లీ తుఫాను నష్టాన్ని ఆడియో, వీడియో రూపంలో గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టిట్లీ తుఫాను బాధిత శ్రీకాకుళం జిల్లాకు తప్పనిసరిగా సాయం చేసేలా కోరాలని వినతిపత్రం ఇచ్చానని చెప్పారు. తమ వినతికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని అన్నారు.
జీవో 90 కొట్టివేత, మూణ్ణెళ్లలో..: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబుకు హైకోర్టు భారీ షాక్
ప్రధానిని కలుస్తాం, రాష్ట్ర ప్రభుత్వం సాయం సరిపోలేదు
టిట్లీ తుఫాను బాధితుల అంశంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే తాము ప్రధాని నరేంద్ర మోడీని కలిసే విషయంపై నిర్ణయిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. కేరళలో అంత బీభత్సం జరిగితే ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్లారని, ఏపీలో మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఇంత జరిగితే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మీడియా పోలరైజేషన్ వల్ల కూడా నష్టం వెలుగు చూడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం సరిపోలేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. మత్స్యకారులకు సహాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బృందం తక్షణం శ్రీకాకుళంలో పర్యటించాలన్నారు. తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని గవర్నర్ చెప్పారని తెలిపారు.
హైకోర్టు ఆదేశాలు.. మూణ్ణెళ్లలో ఎన్నికలు నిర్వహించాలి
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. స్థానిక సంస్థల అధికారాలు నిలబెట్టేలా హైకోర్టు ఆదేశాలు ఉండటం శుభపరిణామం అన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే జీవో 90
ప్రజల చేత ఎన్నికయ్యే ప్రతినిధులు లేకపోతే స్థానిక సమస్యలను ఎలా పరిష్కరిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసమే జీవో 90 తీసుకు వచ్చిందని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టాన్ని నవ్వులపాలు చేసేలా జీవో 90 తీసుకు వచ్చారని ఆరోపించారు.
నాదెండ్ల మనోహర్ ఏం చెప్పారంటే
గవర్నర్ను కలిసిన వారిలో పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ఇంకా పూర్తిగా అందలేదని, అయినప్పటికీ ఆ సాయం సరిపోదని నాదెండ్ల చెప్పారు. గవర్నర్కు ఇచ్చి అంశాలకు సంబంధించిన కాపీలను అందరికీ ఇస్తామని చెప్పారు.
అప్పటిదాకా నిర్వహించలేమని చంద్రబాబు
అంతకుముందు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికల అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. అది తీరే వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అవినీతి నిర్మూలనకే పెద్ద నోట్లు రద్దని కేంద్రం చెప్పిందని, మరి మళ్లీ రూ.2000, రూ.500 నోట్లు ఎందుకు ముద్రించారని ప్రశ్నించారు. నోట్ల రద్దుకు టీడీపీ వ్యతిరేకం కాదని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా దశలవారీగా చేయాలన్నదే తమ అభిప్రాయమన్నారు.