ప్రభుత్వానికి 48గంటల డెడ్లైన్ : కిడ్నీ వ్యాధి బాధితులతో పవన్ ముఖాముఖి(వీడియో)
శ్రీకాకుళం: కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ఇక్కడికి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మంగళవారం ఇచ్ఛాపురంలోని మణికంఠ థియేటర్లో కిడ్నా వ్యాధి బాధితులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు బాధితులు ఆయన తమ సమస్యలను, బాధలను చెప్పుకున్నారు. కిడ్నీ వ్యాధి కారణంగా తమ కుటుంబంలోని సభ్యులను కోల్పోయామని పలువురు మహిళా బాధితులు కన్నీటిపర్యాంతమైంది. తమ సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ తమకు సాయం చేస్తారని అనుకుంటున్నామని చెప్పారు. కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రతీసారి డయాలసిస్ కోసం భారీగా ఖర్చులు అవుతున్నాయని, కూలీ పనులు చేసుకునే తాము అంత మొత్తం భరించలేకపోతున్నాయని బాధితులు వాపోయారు. తమను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చికిత్స కోసం నెలకు రూ.10వేలకు మించి ఖర్చు అవుతోందని అన్నారు. చికిత్స కోసం తమకున్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తోందని వాపోయారు. 20ఏళ్ల నుంచి బాధపడుతున్నా అడిగే వారు లేరంటూ కన్నీటిపర్యాంతమయ్యారు.
ప్రభుత్వానికి 48గంటల డెడ్లైన్: పవన్
ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యపై 48గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే 48గంటల్లో వ్యాధిబారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు ఏదో రకంగా సాయం చేయాలని అన్నారు. దత్తత తీసుకోవడం లేదా ఆర్థికంగాసాయం అందించడం చేయాలని అన్నారు.
అంతేగాక, ప్రభుత్వం ఉద్ధానం కిడ్నీ వ్యాధిపై కమిటీ వేసి జబ్బుపడ్డ వ్యక్తులకు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. 15రోజుల్లోగా జనసేన పార్టీ ఒక వేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తుందని తెలిపారు. తానే స్వయంగా ముఖ్యమంత్రికి ఆ నివేదికను అందించి సమస్యపై వివరిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 15రోజుల తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ప్రజా ఉద్యమం చేస్తామని చెప్పారు. తాను ముందుండి నడిపిస్తానని చెప్పారు.
తనకు కొద్ది నెలల క్రితమే తమకు ఈ సమస్య తెలిసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వీరి బాధలు విన్న తర్వాత తనకు చాలా బాధేసిందని అన్నారు. కృష్ణమూర్తి లాంటి వ్యక్తులు సమస్యలపై పోరటం చేసిన తీరకపోవడం విచారకరమని అన్నారు. ప్రజలను ఓటు బ్యాంక్ లా చూడకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు పని చేయాలని అన్నారు.
జనసేన పార్టీ ప్రజల సమస్యలపై దృష్టిసారిస్తుందని చెప్పారు. వైద్యులు తమ సాయం అందించాలని కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని అడిగితే నిధుల్లేవంటారని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై స్పందించాలని అన్నారు. ఓట్ల కోసమే ఇక్కడి వచ్చి ఆ తర్వాత ఈ సమస్యలను మర్చిపోవడం సమంజసం కాదని అన్నారు.
ఇచ్ఛాపురంకు పవన్: కిడ్నీ బాధితుల వ్యథలపై జనసేన డాక్యుమెంటరీ ఇదే
కేంద్రం నోట్ల రద్దు చేసి బాగానే డబ్బులు రాబట్టుకుందని, రాష్ట్రానికి కూడా ఆదాయం బాగానే ఉందన.. ఉద్ధానం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించాలని పవన్ కళ్యాన్ డిమాండ్ చేశారు. డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం సరికాదని, అది ప్రాణాలు కాపాడేందుకు చివరి దశ మాత్రమేనని అన్నారు.
కిడ్నీవ్యాధిగ్రస్తుల బాధ తనకు తెలుసని, తన పిన్ని భర్త కూడా కిడ్నీ వ్యాధితో చనిపోయారని అన్నారు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ వ్యాధి ఎన్ని గ్రామాల్లో ఉంది, ఎంతమంది ఈ వ్యాధిబారిన పడ్డారనేదానిపై అధ్యయనం చేయాలని అన్నారు. వ్యాధిబారిన పడిన వారిని మెడికల్గా వెంటనే ఆదుకోవాలని అన్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందనేదానిపై పరిశోధన జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
ప్రభుత్వాలు స్పందించి సమస్యను లేకుండా చేయాలని అన్నారు. పుష్కరాలకు వందకోట్లు, రాజధానికి వేలకోట్లు పెడతారు కానీ, మనుషులు చచ్చిపోతుంటే పట్టించుకోరా? అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి రాలేదంటే బాధ కలుగుతోందని అన్నారు. రాష్ట్ర విడిపోతున్న సమయంలో కూడా ఈ సమస్యను జాతీయ స్థాయిలో తీసుకెళ్లలేదని అన్నారు.
పార్లమెంటులో కూడా ఏ నేత మాట్లాడలేదని అన్నారు. వైద్యులు హరిప్రసాద్, సందీప్, అశోక్ యాదవ్, కృష్ణమూర్తిలతో తాము ఒక కమిటీని నియమిస్తున్నామని చెప్పారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తాము రాజకీయం చేయడం లేదని, ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తున్నామని పవన్ తెలిపారు.
1995 నుంచే ఈ బాధలు: వైద్యులు
1995లో రక్తహీనత(ఎనీమియా) ఇక్కడి ప్రజల్లో ఉందని గుర్తించామని స్థానిక వైద్యులు కృష్ణమూర్తి తెలిపారు. బాధితులను చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. వ్యాధిని మొదట నిర్మూలిస్తే వ్యాధి ప్రభావం తక్కువగా ఉంటుందని అన్నారు. ఆర్ఎంపీలకు కూడా పలు సూచనలు చేశామని అన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు నీరు ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వాల స్పందన సరిగా లేదని అన్నారు.
చాలా మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయారని, పెద్దలు తమ కుమారులు, కుమార్తెలను కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం సరైన దృష్టితో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. తాను జిల్లా కలెక్టర్ను కలిశానని, హ్యాంకాంగ్ వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య పరిష్కరించవచ్చని అన్నారు.
డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా వ్యాధిని ప్రబలకుండా మొదటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని అన్నారు. పవన్ కళ్యాణ్.. వ్యాధిగ్రస్తుల సమస్యలపై స్పందించటం మంచి విషయమని అన్నారు. వ్యాధిగ్రస్తులకు బస్ పాస్లను కల్పించాలని, వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కిడ్నీ వ్యాధి కారణంగా ఇక్కడి యువతకు పెళ్లిళ్లు కూడా కావడం లేదని అన్నారు.