పవన్ కల్యాణ్: హుటహుటిన హస్తిన పయనం, జేపీ నడ్డాతో భేటీ, తాజా రాజకీయాలపై చర్చ..
ఏపీలో స్థానిక సంస్థల సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణాలు చక చకా మారిపోతున్నాయి. పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఫోన్ రావడంతో ఆయన హుటహుటిన ఢిల్లీ బయల్దేరారు. ఆయన వెంట సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్ కల్యాణ్ ఢిల్లీలో కీలక నేతలతో సమావేశం కానున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న వీరు.. బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ అవుతారు. సమావేశంలో రాజధాని అమరావతిలో జరిగే ఆందోళనలపై ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఏపీలో రాజకీయాలపై కూడా డిస్కష్ చేస్తారు.
శనివారం నడ్డాతో సమావేశం పూర్తవగానే.. ఆదివారం కూడా పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వీలునుబట్టి హోంశాఖ మంత్రి అమిత్ షాను కలువబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. బీజేపీ పెద్దలు, కేంద్రమంత్రులతో.. రాజధాని సమస్యపై డిస్కష్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఏపీలో వైసీపీతో బీజేపీ స్నేహ హస్తం అందిస్తూనే.. విపక్షాలను కూడా మచ్చిక చేసుకుంటుందని దీనిని బట్టి అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ను.. నడ్డా ఢిల్లీకి పిలిపించడం ఇందులో భాగమేననే ప్రచారం కూడా జరుగుతుంది. రాజధాని అంశం గురించి అడిగి.. జనసేనతో కలిసి బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు కూడా పెట్టుకోవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఏదీ ఏమైనా.. నడ్డా, అమిత్ షాతో భేటీ తర్వాత జనసేన, బీజేపీ అధికార ప్రతినిధులు మీడియాకు చెబితే తప్ప ఈ అంశాలపై క్లారిటీ రాదు.