అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే కలిగే నష్టాల వివరణ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. సోమవారం ఢిల్లీ చేరుకున్న ఆయన మంగళవారం అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రమంత్రితో పవన్ చర్చించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని, రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరారు. అవకాశం ఉన్నంత మేరకు అప్పులు మాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఏపీకి ప్రత్యేక గనులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వల్ల 18వేల మంది శాశ్వత, 20వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులపై ప్రభావం పడుతుందని అమిత్ షాకు పవన్ వివరించారు. అంతేగాక, పరోక్షంగా మరో లక్ష మంది జీవితాలపై ఈ ప్రభావం ఉంటుందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, తిరుపతి ఉపఎన్నికపైనా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
జనసేన పార్టీలో చేరికలు
జనసేన పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో తూగో జిల్లా కాట్రెనికొన మండలం దోంతికూర్రు గ్రామ టీడీపీ, వైసీపీలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు చేరారు. జనసేన క్రీయాశీలక సభ్యత్వ నమోదు ద్వారా పార్టీలోకి ఆహ్వానించారు జనసేన నాయకులు. అనంతరం జరిగిన సమావేశంలో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీని బలపరిచెందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని కోరారు.