పవన్ కళ్యాణ్! చిరంజీవి మోసగించారా? మాట్లాడు: రామచంద్రయ్య
విజయవాడ: ప్రజారాజ్యం పార్టీ పేరుతో నాడు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కాపులను మోసగించారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారని, దీని పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య సోమవారం డిమాండ్ చేశారు.
కాపులకు రిజర్వేషన్ల పేరిట దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంను సోమవారం నాడు చిరంజీవి పరామర్శించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో దీని పైన నారాయణ ఆదివారం సాయంత్రం ఘాటుగా స్పందించారు. చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో కాపులను మోసగించారన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలో ఉండి కాపులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మద్దతును ముద్రగడ తీసుకుంటే అది సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై సీ రామచంద్రయ్య సోమవారం నాడు స్పందించారు.
కాపులకు మంత్రి నారాయణ ఏం చేశారో చెప్పాలన్నారు. పీఆర్పీతో (ప్రజారాజ్యం) కాపులను మోసగించారని మంత్రి అన్నారని, దీని పైన పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ నేత తోట త్రిమూర్తులు మాట్లాడుతూ... బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోను తమ ప్రభుత్వం అన్యాయం చేయదని చెప్పారు. అలాగే, కాపులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకుంటారని చెప్పారు. కాగా, టిడిపి నేతలు ముద్రగడతో చర్చలు ప్రారంభించారు.