కులాల గుప్పిట్లో కాదు, చిరంజీవి ఓ ప్రయత్నం చేశారు: పవన్, దాసోజు శ్రవణ్ ప్రస్తావన
ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వారు గుప్పెట్లో పెట్టుకున్నారని విమర్శించారు.
Recommended Video
వారు సమాజాన్ని విభజించి పాలిస్తున్నారని ఆరోపించారు. మనుషులుగా ఉన్నా కులాలుగా విడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందనేది మీరేనని అన్నారు. కాబట్టి కాపు రిజర్వేషన్లపై బీసీ కులాలకు లాభనష్టాలను వివరించాలన్నారు. జిల్లాలో ఆయన పలువురితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భీమవరంలో డంపింగ్ యార్ట్ లేకపోవడం ప్రధాన సమస్య అన్నారు.
ప్రశ్నించేందుకే వచ్చామనే విషయం తగ్గించాలి
జనసేన అందరి పార్టీ అని పవన్ అన్నారు. మనది ప్రశ్నించే పార్టీ అని చెప్పడంతో అధికారం ఇంకొకరికి ఇస్తారనే వాదనను ప్రజల్లోకి తీసుకు వెళ్లారని చెప్పారు. తద్వారా కేవలం ప్రశ్నించేందుకే పుట్టిందనే విషయాన్ని తగ్గించాల్సి ఉందన్నారు. తద్వారా పరిపాలన కూడా సాధిస్తామని అభిప్రాయపడ్డారు. నేను చిత్తశుద్ధితో పని చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మనలోని అనైక్యత వల్ల మనం దెబ్బతింటాం, మోసపోతామని బీసీ సంఘ నాయకులతో అన్నారు. దశాబ్దాలుగా మోసం చేస్తున్నప్పటికీ మనం ఓట్లు వేస్తున్నామన్నారు. కులాల ఐక్యత జరిగినా జరగకున్నా సాధించాలనే ఆశయం తనది అన్నారు.
ప్రజారాజ్యం ద్వారా ఓ ముందడుగు వేశాం
ఉత్తరాంధ్ర ప్రాంతంలో కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప కులాలు బాగుపడటం లేదని పవన్ అన్నారు. ఆయా పార్టీలలోని ఆయా కుల నాయకులు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. 2009లో తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామన్నారు. బీసీలు రాజ్యాధికారంలో వెనుకబడిపోతున్నారని తాము ఎక్కువ సీట్లు ఇచ్చామని, అది సఫలీకృతం కాకపోయినప్పటికీ ఓ ముందడుగు వేశామన్నారు. కానీ మిగతా వారు ఎవరూ చేయలేదన్నారు. అది గొప్ప ప్రయత్నమని, ఆ ప్రయత్నం వెనుక గొప్ప ఆశయం ఉందన్నారు. కానీ మిగతా పార్టీలలోని వారితో పోటీ పడలేక దెబ్బతిన్నారన్నారు. బీసీలలో వందకు పైగా కులాలు ఉన్నాయన్నారు. కానీ కులాల మధ్య ఐక్యత లేదన్నారు.
దాసోజు శ్రవణ్ కుమార్ ప్రస్తావన
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ గురించి పవన్ ప్రస్తావించారు. బీసీలు ఇక్కడకు వచ్చి మాట్లాడుతారని, కానీ గ్రామాల్లోకి వెళ్లాక ఎవరికి వారు విడిపోయి మాట్లాడుతారని చెప్పారు. తన స్నేహితుడు దాసోజు శ్రవణ్ అనే విశ్వబ్రాహ్మణ్ నేతకు 2009లో సికింద్రాబాద్ లోకసభ స్థానం కేటాయించామన్నారు. ఆ రోజున అతనికి లక్షా 38వేల ఓట్లు వచ్చాయని, కానీ అక్కడ ఆయన కులం వారు ఎవరూ లేరన్నారు. ఎందుకంటే ఆయనకు అన్ని కులాల వారు ఓటు వేశారన్నారు. అదే దాసోజు శ్రవణ్ 2014లో పోటీ చేస్తానని అడిగితే పట్టుమని మీ కులం వాళ్లు ప్రతి ఊరిలో నలుగురు ఉండరు.. కాబట్టి నీకు సీటు ఇచ్చినా గెలవవు అని వ్యాఖ్యానించారని, దీంతో అతను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడని పవన్ తెలిపారు. దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమంలో తెరాస తరఫున కీలకంగా పని చేశారు. కానీ ఆయనకు కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సర్దార్ గౌతు లచ్చన్న పేరును కూడా ప్రస్తావించారు.
కులాలు కాదు, కుటుంబాల గుప్పెట్లో
రెండు కులాల మీద కోపం చూపిస్తే సమస్య పరిష్కారం జరగదని పవన్ అన్నారు. సమాజంలో ఉన్న కులం లేనికులం రెండు మాత్రమే అన్నారు. ఎక్కడైనా కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులం బాగుపడట్లేదన్నారు. జీవితంలో కులాల గురించి మాట్లాడుతానని నేను అనుకోలేదని, తనను అలా పెంచలేదన్నారు. నాకు దేశభక్తి నేర్పించింది దళిత టీచర్ అన్నారు. ఏపీని చంద్రబాబు, జగన్ గుప్పిట్లో పెట్టుకున్నారని, తాను కులాలు అని కూడా చెప్పనన్నారు. ఇక్కడ కుటుంబాలు మాత్రమే గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు.
ప్రత్యేక హోదాపై కూడా మాట్లాడుతున్నా
కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడితే బీసీలు దూరమవుతారు, బీసీల గురించి మాట్లాడే వారు దూరమవుతారని లెక్కలు వేసి సమాజాన్ని చీట్ చేస్తున్నారని, ముక్కలు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. అందరూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారన్నారు. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి నేతలు పదవులు లేకున్నా ఎంతో పని చేశారన్నారు. కానీ అలా అని జనసేనకు పదవి వద్దని చెప్పడం లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి తాను సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతున్నానని, కానీ ఇక్కడి సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతున్నానని చెప్పారు. నేను అన్ని పార్టీలకు సమదూరం పాటిస్తానని చెప్పారు. నాయి బ్రాహ్మణులకు ఎక్కువ డబ్బులు ఇస్తే చెడిపోతారని చంద్రబాబు చేయి పెట్టి బెదిరించినట్లుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. నేను సామాజిక మార్పు కోరుకుంటున్నానని చెప్పారు. నేను రామ్ మనోహర్ లోహియా ఆలోచనలతో ఉన్నానని చెప్పారు.