ముందు కౌగిలించుకుని, వెనుకనుంచి వెన్నుపోటు: ఉద్దానంపై పవన్ దీక్ష విరమణ
శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తాను దీక్ష చేయాల్సిన వచ్చిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించాలంటూ శుక్రవారం సాయంత్రం నుంచి దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం 5గంటలకు విరమించారు.
పవన్ ఒకరోజు దీక్షను ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ప్రభుత్వం ముందుంచిన 17డిమాండ్లపై స్పందించకపోవడంతో దీక్షను విరమించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఉద్దానం రెండో కోనసీమ ప్రాంతమని అన్నారు. శ్రీకాకుళంకు 196కిలోమీటర్ల తీరం ఉందని చెప్పారు.కేరళ తరహాలో పర్యాటక ప్రాంతంలా ఉంటుందని అన్నారు.
బాబు అనుకున్నట్లు కాదు
చంద్రబాబు అనుకుంటున్నట్లు తాను రాజకీయ గుర్తింపు కోసం దీక్ష చేయడం లేదని పవన్ అన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలపై స్పందిస్తే తాము ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదని అన్నారు. రూ.2వేల కోట్లను పుష్కరాలకు కేటాయించిన ప్రభుత్వం.. ఆ మాత్రం ఉద్దానం బాధితుల కోసం ఖర్చు చేయలేదా? అని పవన్ ప్రశ్నించారు.
సామాజిక చైతన్యం కోసమే..
పేదల జీవితాలు మారడం లేదని, నేతల జీవితాలు మాత్రం ఉన్నతమవుతున్నాయని అన్నారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోరాటం తప్పదని అన్నారు. సామాజిక చైతన్యం కోసమే పోరాటం చేస్తున్నామని పవన్ తెలిపారు. సినిమాల్లో అయితే 2.30గంటల్లోనే సమస్యలు పరిష్కారమవుతాయని, కానీ, ఉద్దానం సమస్యలు పరిష్కరించగలిగినవారే నిజమైన హీరోలని అన్నారు.
ఉద్యమాలు తప్పవు
అన్యాయం పరాకాష్ట కు చేరుకున్నప్పుడు ఉద్యమాలు వస్తాయని పవన్ చెప్పారు. వేల కోట్లు సంపాదించిన సీఎం.. పారిశ్రామికవేత్తలతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వారి సమావేశం ఏర్పాటు చేసి ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.
ఆరోగ్యమంత్రి కూడా లేరు..
అభివృద్ధి పేరుతో విదేశాలకు వెళ్లేందుకు డబ్బులుంటాయి కానీ, పేదల ఆరోగ్యంపై ఖర్చుకు డబ్బులు ఉండవా? అని పవన్ ప్రశ్నించారు. అన్ని రాజకీయా పార్టీలు కులాలను విభజించి పాలిస్తున్నాయని అన్నారు. రోగుల బాధలు వినడానికి రారాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రి కూడా లేరని పవన్ మండిపడ్డారు.
ఎంతమందికి ప్రభుత్వ సాయం
20వేల మంది ఉద్దానం కిడ్నీ బాధితులంటే ఎంతమందికి ప్రభుత్వం ఆర్థిక సాయం, పింఛన్లు అందిస్తోందని ప్రశ్నించారు. శుక్రవారం సభ పెట్టాల్సి ఉండగా ప్రభుత్వం అందుకు సహకరించలేదని, తాను పోలీసులను, అధికారులను నిందించడం లేదని, ప్రభుత్వమే దీనంతటికీ కారణమని అన్నారు.
ముందు నుంచి కౌగిలించుకుని..
ఏ మూలన ఉన్న తెలుగు ప్రజలు తెలుగు ప్రజలేనని, తెలుగు ప్రజలంటే టీడీపీ ప్రజలు కాదని పవన్ అన్నారు. ముందుకు కౌగిలించుకుని వెనుకనుంచి వెన్నుపోటు పొడుతస్తున్నారని, ఇలాంటి వారిని నమ్మడం ఎలా? అని పవన్ ప్రశ్నించారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతున్నట్లు పవన్ తెలిపారు. బాధితులకు కావాల్సిన వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని కోరారు.