అఖిలపక్షానికి పవన్ గైర్హాజరు..! కారణం ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలేనా..??
అమరావతి/ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటీకి తమ పార్టీ దూరంగా ఉంటున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. సమావేశానికి సంబందించి సమయం ఇవ్వకుండా ఆహ్వానిస్తే ఎలా అని ప్రశ్నించారు. సరైన అజెండా లేకుండా నిర్వహించే మొక్కుబడి భేటీలకు జనసేన దూరంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై అఖిలపక్ష సమావేశం పెట్టడం హర్షణీయమన్నారు.
వాడివేడిగా అఖిలపక్షం..! కాని జనసేనాని దూరం..!!
‘గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార్కి.. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకోసం అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలతో మీరు సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయం. ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అయితే, బుధవారం సమావేశం ఏర్పాటు చేసి.. మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపణీయంగా ఉంది. తగిన సమయం ఇవ్వకుండా, సమావేశం పూర్తి స్థాయి ఎజెండాను నిర్ణయించకుండా ఏర్పాటు చేసిన ఈ సమావేశం కేవలం మొక్కుబడిగా గోచరిస్తుంది. అందుకే జనసైన అఖిల పక్షానికి రావడంలేదు. ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఇచ్చిన సమాధానం. ఐతే ఈ సమాధానం వెనక అసలు కారణం వేరే ఉందనే చర్చ జరుగుతోంది.
సీరియస్ పాలిటిక్స్ ఐతే చెప్పండి..! టైంపాస్ రాజకీయాలు అవసరం లేదన్న పవన్..!!
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేయడానికి జనసేన చేతులు కలుపుతుంది కానీ మొక్కుబడి సమావేశాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వవని మా పార్టీ విశ్వసిస్తోంది. బలమైన పోరాటంతోనే హోదా సాధిస్తుంది. అటువంటి పోరాటానికి మాత్రమే జనసేన చేతులు కలుపుతుంది'' ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకోసం అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఆహ్వానించగా పవన్ పై విధంగా స్పందించారు.
జనసేన టీడిపి ఒక్కటే అంటున్న వైసీపీ..! కొట్టి పారేస్తున్న గబ్బర్ సింగ్..!!
చంద్రబాబు నిర్వహించబోయే సమావేశానికి హాజరు కాబోమని పవన్ మంగళవారం రాత్రి ఓ లేఖను రాశారు. ఇప్పుడిది ఏపీ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది. ఎందుకుంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ నేతృత్వంలో మంగళవారం విజయవాడలోని ఓ హోటల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 5 గంటలపాటు జరిగిన ఈ సమావేశానికి పవన్ హాజరయ్యాడు. కానీ, చంద్రబాబు ఆహ్వానాన్ని మాత్రం తిరస్కరించాడు. దీంతో దీని గురించి అంతా చర్చించుకుంటున్నారు.
అఖిలపక్షానికి వెళ్తే వైసీపి ఎలాంటి ప్రచారం చేస్తుందో..! అందుకే కాటమరాయుడు వెనకడుగు..!!
అయితే, పవన్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడానికి బలమైన కారణాలున్నాయని తెలుస్తోంది. అధికార పార్టీతో ఎంత దూరంగా ఉంటున్నా ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ-జనసేన ఒక్కటేనని ప్రధాన ప్రతిపక్షం బాగా ప్రచారం చేస్తోంది. దీనికితోడు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు జనసేనతో పొత్తును కోరుకుంటున్న సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఈ సమావేశానికి హాజరైతే వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నిజం చేసినట్లవుతుందనే ఆలోచనతో జనసేన అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఏపీలోని మూడు పార్టీల్లో ఇదే అంశం పై చర్చ జరుతున్నట్టు తెలుస్తోంది.