వేదికపై పవన్ ఒక్కరే: పంచ్ డైలాగులతో గంటసేపు, చిత్తూరు ఫ్యాన్స్కే అనుమతి
అమరావతి: శ్రీవారిని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శనసమయంలో సుప్రభాత సేవలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. టీటీడీ అధికారులు పవన్కు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. కాగా గత రెండు రోజులుగా తిరుమలలోనే బస చేసిన పవన్ 3 గంటల వరకూ తిరుమలలోనే ఉంటారని, భోజనం అనంతరం తిరుపతికి వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మరోవైపు తిరుపతిలోని ఇందిరా మైదానంలో పవన్ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన అనుమతి కోసం పార్టీ కోశాధికారి రాఘవయ్య అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మిని అనుమతి కోరారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే పవన్ సభకు అనుమతి ఇవ్వడం జరిగింది.
తిరుపతి బహిరంగ సభపై పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండి జనసేన కార్యకర్తలకు, అభిమానులకు దిశానిర్దేశం చేయనున్నారు. పవన్ సుమారు గంట సేపు ఈ సభపై నుంచి మాట్లాడనున్నారు. పవన్ పంచ్ డైలాగులతో ప్రసంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలిసింది.
పవన్ తిరుపతి సభకు భారీగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో మైదానం వెలుపల కూడా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను చూసుకునేందుకు హైదరాబాద్కు చెందిన ప్రత్యేక బృందం శుక్రవారం తిరుపతికి వచ్చింది.
హైదరాబాద్ నుంచి వచ్చిన హనీఫ్, రియాజ్, మహీందర్ రెడ్డి, శంకర్ గౌడ్, నగేష్, నరసింహలు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతికి చెందిన జనసేన నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్రాయల్ తదితరులు వారికి సహకరిస్తున్నారు. కేవలం సభకు వచ్చేవారిని మాత్రమే అనుమతిస్తారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ సభలో కేవలం చిత్తూరు జిల్లా అభిమానులకు మాత్రమే అనుమతి ఉంది. ఇతర జిల్లాల నుంచి వస్తున్న అభిమానులను జనసేన పార్టీ నేతలు వెనక్కి పంపుతున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.
తిరుపతి సభ తర్వాత విజయవాడ సభకు జనసేన ప్రణాళికలు రచిస్తోంది. అప్పటికప్పుడు అధినేత శ్రేణుల కోసం నిర్వహిస్తోన్న తిరుపతి సభకు తరలిరావాలని జిల్లా సహా అన్ని ప్రాంతాలకు సమాచారం పంపారు. పవన్ తిరుపతికి సుమారు నలభై వేల మంది అభిమానులు రానున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి.
పవన్ తిరుపతి సభకు అభిమానులే అన్నీ తామై ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం తుడా మైదానాన్ని ఎంపిక చేసుకుని శుక్రవారం రాత్రి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. మైదానంలో బ్యారికేడింగ్, మీడియా గ్యాలరీ, విచ్చేసిన వారికోసం తాగునీటి వసతి, వేదికను సిద్ధం చేస్తున్నారు.
శుక్రవారం రాత్రి పొద్దు పోయే సమయానికి సౌండ్ సిస్టమ్ తదితరాలను సమకూర్చుకున్నారు. పార్టీ నాయకులు, పోలీసులు పలుమార్లు మైదానాన్ని పరిశీలించి వెళ్లారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు తిరుమల బైపాస్ మార్గంలో పీఎస్ఆర్ హోటల్ వద్ద, ఇటు నగరపాలక సమీపాన ఉన్న సెంట్రల్పార్క్ వద్ద ఉన్న మార్గాలను మూసివేయనున్నారు.
అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో రాకపోకలకు ఆటంకాలు కలగకుండా పోలీసులు చర్యలు ప్రారంభించారు. భద్రతా పరంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పవన్కల్యాణ్ శనివారం సాయంత్రం మూడు గంటలకు తిరుమల నుంచి బయల్దేరి బహిరంగసభకు వస్తారు. అక్కడ ప్రసంగించి ఆపై చెన్నై మీదుగా హైదరాబాద్ వెళ్లనున్నారు.