భయభ్రాంతులకు గురిచేస్తోంది: ప్రభుత్వం దిగివచ్చేలా చేశామంటూ పవన్ కళ్యాణ్
అమరావతి: రాజధాని రైతులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాజధాని గ్రామం కృష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారుల ఎదుట నిరసన తెలిపిన రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వెల్లడిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
భయాభ్రాంతులకు గురిచేస్తోంది..
‘రాజధాని అమరావతి పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 426 మందిపై కేసులుపెట్టి రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తక్షణమే ఈ కేసులను ఉపసంహరించుకోవాలి. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను.. ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించకనే ఆ రైతులు నిరసన తెలిపారు' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
జనసేన బాసటగా ఉంటుంది..
‘మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి రైతుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి తరుణంలో కేసులుపెట్టడం లాంటి చర్యలు పుండు మీద కారం చల్లినట్లు అవుతుంది. తొలి రోజు నుంచీ రైతులు శాంతియుతంగా తమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం రైతాంగంతో చర్చించకుండా కేసులుపెట్టడం లాంటి చర్యలకు దిగడం అప్రజాస్వామికం అవుతుంది. రాజధాని కోసం పోరాడుతున్నవారికి జనసేన బాసటగా నిలుస్తుంది' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
అందుకే రాజకీయాల్లోకి వచ్చా..
ఇది ఇలా ఉండగా, ఢిల్లీ నిర్వహించిన ‘ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్' సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. భగత్ సింగ్ లాంటి వారు తనకు ఆదర్శమని చెప్పారు. దేశానికి సేవ చేయాలనే తపనతో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయినా తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేదని అన్నారు. లక్ష్యం కోసం పోరాటం చేస్తూనే ఉంటాన్నారు.
జనసేన పోరాటంతోనే.. సుగాలి కేసు సీబీఐకి
‘నాలుగేళ్ల క్రితం, కర్నూలులో పద్నాలుగేళ్ల బాలిక.. రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లి.. అత్యాచారానికి, ఆపై హత్యకు గురైంది. 2015లో ఈ ఘటన జరిగితే, గడచిన ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. నేను 2019 ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకుంటున్న తరుణంలో ఆ బాలిక తల్లి నా వద్దకు వచ్చింది. తన వేదనను నాతో పంచుకుంది. బాలికకు జరిగిన అన్యాయానికి సంబంధించిన ప్రతి సాక్ష్యమూ ఉంది. అయితే, దోషులు బలవంతులు కాబట్టి వారికి మాత్రం శిక్ష పడలేదు. ఇది విన్నాక నా హృదయం కలచివేసినట్లైంది. వారం కిందట కర్నూలులో జనం అండగా.. భారీ ర్యాలీ నిర్వహించాను. దాని పర్యవసానంగా ఐదేళ్లుగా చడీచప్పుడు లేని ఈ కేసును, సీబీఐకి అప్పగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది' అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
దేశపు జెండాకు ఉన్నంత పొగరు..
‘ఒక విషయం మీరు గ్రహించాలి... రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. ఎక్కువగా ఏకాంతమే శరణ్యమవుతుంది. అలాంటప్పుడు మీకు ప్రముఖుల రచనలు, సాహిత్యం, జీవిత చరిత్రలే తోడవుతాయి. ఆ సాహిత్య, జీవితచరిత్రల ద్వారానే ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలని సూచించారు. ఇలాంటి సమయాల్లో నేను చదివిన గుంటూరు శేషేంద్ర శర్మ కవితను మీకు వినిపిస్తా.. ‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. నేనంతా కలిపి పిడికెంత మట్టే కావచ్చు.. కానీ గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకి ఉన్నంత పొగరు ఉంది' అని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక మానసికంగా మీరు ఒంటరి అవుతారు. ఏ స్నేహితుడూ మిమ్మల్ని తొందరగా అర్థం చేసుకోరు. తోడు రాక పోవచ్చు. అయినా సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.