2019లో నేనే.. ఏపీ సీఎంగా పోరాడబోతున్నా: తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో చెప్పిన పవన్!
Recommended Video
చెన్నై: త్వరలో తాను తమిళనాడు నాయకులను అందరినీ కలుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం చెప్పారు. ఆయన చెన్నైలో కమల్హాసన్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జల్లికట్టు సమయంలో తమిళనాడు యువత ఆవేశం చూశామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలలో ప్రజలకు నాయకులు చేరువ అవ్వాలని చెప్పారు.
చంద్రం ఎఫెక్ట్, హరికృష్ణ చనిపోతే సంబరంతో కూడిన ఆశ్చర్యమా, బాలకృష్ణా! నిజమేనా: విజయసాయి
జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇక్కడి రాజకీయాల్లో తలదూర్చడం నచ్చలేదని చెప్పారు. జల్లికట్టును ఉద్యమంగా చూడలేదని, అది బీజేపీ మీద ఉన్న కోపమని అన్నారు. వారి ఆవేశం, వారి ఆత్మాభిమానాన్ని రక్షించుకోవడం కోసం చేసిన పోరాటంగా చూశానని చెప్పారు. తనను తాను సీఎంగా చూసుకోవాలనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు.
జనసేన ప్రత్యేక దేశం కోరుకోవడం లేదు
తమిళనాడు రాజకీయాల్లో జాతీయ పార్టీలు వేలుపెట్టడం, నోట్ల రద్దు, జయలలిత మృతి తర్వాత జరిగిన పరిణామాలు బీజేపీ మీద కోపం వచ్చేలా చేశాయని పవన్ అన్నారు. 2019లో ఎన్నికలు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉంటాయని, సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటాయని పవన్ జోస్యం చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ద్రవిడ సంప్రదాయాన్ని అర్థం చేసుకోకుండా, ఇక్కడి సంప్రదాయాలపై దాడులు చేయడం వల్ల జల్లికట్టు ఉద్యమం వచ్చిందని చెప్పారు. ద్రవిడనాడు ప్రత్యేక దేశం అనేది ఒక భావోద్వేగాలతో నిండిన ఉద్యమమని, భారత్ దేశంపై ఉన్న చిన్నచూపు వలన కొంతమంది తీసుకొచ్చిన ఉద్యమం అది అని, జనసేన ప్రత్యేక దేశాన్ని కోరుకోవడం లేదని చెప్పారు.
చిరంజీవికే ఎదురు వెళ్లా
రాజకీయాల్లోకి వచ్చే నటులు కావచ్చు, వేరేవారైనా సరే వారికి చాలా సహనం కావాలని, కనీసం రెండు దశాబ్దాల పాటు మార్పు కోసం పోరాడే ఓర్పు కావాలని పవన్ అన్నారు. జనసేన పార్టీని బీజేపీలో కలపమని అడిగారని, ప్రజారాజ్యం సమయంలో కొన్ని అనుకోని తప్పులు జరిగి విలీనం చేయాల్సి వచ్చిందని, కానీ నేను పార్టీ ప్రజల కోసం పెట్టానని, వేరే వారితో కలపటానికి అయితే వారితో కలిసి పోటీ చేసేవాడినని చెప్పారు. మోడీ తనకు అన్నయ్య కాదని చెప్పారు. తాను తన సొంత అన్నయ్య చిరంజీవికి వ్యతిరేకంగా వెళ్లినవాడినని, అలాంటిది మోడీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడనని ప్రశ్నించారు.
పక్క రాష్ట్రాన్ని పట్టించుకోం
తాను సినిమాల్లోకి రాకముందు చెన్నైలో చాలా ఏళ్లు ఉన్నానని, తనకు తమిళ భాష అంటే చాలా గౌరవమని, అక్కడ అక్కడ తప్పులు ఉన్నప్పటికి తమిళంలో మాట్లాడేందుకు ఇష్టపడతానని పవన్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ సందిగ్ధత నుంచి ప్రజల తరఫున నిలబడేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మనం దేశాలు తిరుగుతామని, పక్క రాష్ట్రాలను పట్టించుకోమని, అందుకే నన్ను పరిచయంచేసుకొని, జనసేన ఉద్దేశ్యాలను తమిళులకు చెప్పేందుకు, ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతను చెప్పేందుకు వచ్చానని అన్నారు.
నటులు సీఎం కావాలని రాజకీయాల్లోకి రావొద్దు
దక్షిణ భారత సంప్రదాయాలను అర్థం చేసుకోవడంలో ఉత్తర భారం విఫలమైందని పవన్ చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి సినిమా హీరో కూడా ఎంజీఆర్లా సీఎం అవ్వాలని అనుకోవద్దని, పని చేసేందుకు రావాలని, ఈ క్రమంలో సీఎంగా అయితే తనతో సహా ఇంకా ఎక్కువ నిబద్దతతో పని చేస్తారని చెప్పారు. తమిళనాడు యువత, ప్రజలు వారి ఆత్మాభిమానాన్ని జాతీయ పార్టీలకు తాకట్టు పెట్టాలని అనుకోవట్లేదని, అది తనకు నచ్చిందని చెప్పారు. ఆంధ్ర సంస్కృతి కూడా ద్రవిడ సంస్కృతిలో భాగమేనని చెప్పారు. రేపటి రోజు దక్షిణాదిన ఏ రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినా మిగతా రాష్ట్రాలు స్పందించేంద బలంగా ఉండాలన్నారు.
అదే తెలంగాణ ఉద్యమానికి కారణం
తెలంగాణ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి చూపకుండా ఉన్నట్లయితే ఈరోజు ఇలా రెండుగా విడిపోయేది కాదని, ప్రాంతాలు, సంస్కృతి పట్ల ఉన్న నిర్లక్ష్యమే తెలంగాణ ఉద్యమానికి కారణమని పవన్ చెప్పారు. సమస్యను సరిగా బయటకు చెప్పలేకపోవడం, సమస్యపై సరిగా పోరాటం చేయకపోవడం వలన ఉద్యమాలు వస్తాయని, అందువల్ల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బలంగా పోరాడాలన్నారు. నేను ప్రజల కోసం మాట్లాడుతున్నానని చెప్పారు. జనసేన ముఖ్య సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచనా విధానమన్నారు. రాజకీయ పార్టీలు ఏదో ఒక కులం కోసం పని చేస్తున్నాయని, అందుకే అందర్నీ అలాగే భావిస్తున్నారన్నారు. కులరాజకీయం చేయను కాబట్టే టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు.
ఏపీ సీఎంగా నేను పోరాడబోతున్నాను
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు మీకు అండగా నిలబడతారని భావిస్తారో వారికి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 2019లో నేను ఏపీ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నానని మీ అందరికి తెలియజేస్తున్నానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయంపై బలంగా పోరాడబోతున్నానని చెప్పారు.