కాపు రిజర్వేషన్లపై గళమెత్తిన పవన్: ఏపీ, టీ నేతలపై హాట్ కామెంట్స్
కాపు రిజర్వేషన్ల అంశంతోపాటు పలు అంశాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శనివారం సోషల్ మీడియా టీంతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల అంశంతోపాటు పలు అంశాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శనివారం సోషల్ మీడియా టీంతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఏపీ ప్రభుత్వం వాగ్ధానం చేసిందని ఈ సందర్భంగా పవన్ అన్నారు. ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.
కాపు రిజర్వేషన్లపై నాన్చొద్దు..
కాపు రిజర్వేషన్ల హామీ కూడా ప్రత్యేక హోదా లాంటిదేనని అన్నారు. ఆలస్యం చేయకుండా ఏపీ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీని అమలు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. మభ్యపెడితే అశాంతికి కారణమవుతుందని హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఇవ్వండి లేదంటే ఇవ్వలేమని తేల్చి చెప్పాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలా నాన్చుడు దోరణి సరికాదని అన్నారు.
ముద్రగడను అడ్డుకుంటే..
తాను ఒక కులం కోసం పనిచేయనని, ప్రతి కులాన్ని గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఆపే హక్కు పోలీసులకు, ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ముద్రగడను అడ్డుకోవడం శాంతి భద్రతల సమస్యగా మారుతుందన్నారు.
అంబేద్కర్ కోరిక.. క్రిమీలేయర్ విధానంపై..
బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు లేని సమాజం కావాలని కోరుకున్నారని పవన్ ఈ సందర్భంగా చెప్పారు. అందరికీ సమాన హక్కులు కావాలని ఆయన ఆకాంక్షించారని పవన్ తెలిపారు. ‘మా అమ్మ బీసీ(బలిజ). నాన్న అగ్ర కులం. మేము అమ్మ కులం పెట్టుకుని రిజర్వేషన్లు పొందవచ్చు' అని పవన్ అన్నారు. అందుకే క్రిమీలేయర్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
రాజకీయ నాయకులపై..
రాజకీయ నాయకులు చదువుకోనోళ్లు.. అందుకే విద్యకు ప్రాధాన్యమివ్వరని పవన్ ఆరోపించారు. ఓ ఐపీఎస్ అధికారి సహాయంతో పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలిగిందని అన్నారు. అవసరమైన పాఠాలున్నాయి కానీ.. పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగపడే పాఠ్యాంశాలు లేవని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య కోసం టీచర్లకు ఎక్కువ వేతనాలు ఇవ్వాలని అన్నారు. కుగ్రామాల అవసరాల కోసం స్టార్టప్ లు రావాలని అన్నారు.
టీ నేతలు అలా.. ఏపీ నేతలు ఇలా..
ప్రభుత్వాలు మద్యం మీద కంటే విద్య మీద ఎక్కువ ఖర్చు పెట్టాలని పవన్ సూచించారు. తెలంగాణ నాయకులు సమష్టిగా పోరాడుతుంటే.. ఏపీ నాయకులు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీ పడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నించుకోండి..
రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనడం కాదు.. రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం మీరేం చేశారో ప్రశ్నించుకోండని ఏపీ నాయకులకు పవన్ సూచించారు. కేంద్రంపై ఆరోపణలు చేసే ముందు మన రాష్ట్రం కోసం మనం ఏం చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.