టీడీపీ, వైసీపీలా కాదు, అది నా మర్యాద: పవన్, మధ్యతరగతి ప్రజలపై కీలక వ్యాఖ్యలు
అమరావతి: తన మంచి తనాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న లింగమనేని ఎస్టేట్స్ లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం విగ్రహప్రతిష్టాపన జరిగిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానందస్వామి సమక్షంలో ఇద్దరూ మాట్లాడుకున్నారు. గత కొంత కాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు.
విభేదాలు సిద్ధాంతపరమే..
ఇలాంటి సందర్భాల్లో తన మర్యాదను అపార్థం చేసుకోవద్దని పవన్ కళ్యాణ్ కోరారు. ‘రాజకీయ విభేదాలను నేను సిద్ధాంతాల పరంగానే చూస్తా. వ్యక్తిగతంగా చూడను. ఇది కొరవడటం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా నిర్వహించలేకపోయాయి' అని పవన్ వ్యాఖ్యానించారు.
మర్యాదను మరోలా అర్థం చేసుకోవద్దు
‘నాయకులు ఎవరైనా కలిసినప్పుడు మంచిచెడ్డలను అడిగి తెలుసుకోవడం ఒక మర్యాద. నేను కలిసే లేదా శుభాకాంక్షలు తెలిసే నేతలందరికీ నేనెవరో తెలుసు. రాజకీయ ప్రయాణంలో భాగంగా పరిచయాలు ఏర్పడతాయి. తన మర్యాదను మరోలా అర్థం చేసుకోవద్దు' అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
మధ్యతరగతి ప్రజలపై పవన్
అంతేగాక, విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు రాజకీయాలకు దూరంగా పారిపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. సగటు మధ్యతరగతి పౌరుడు రాజకీయాల పట్ల ఆశను కోల్పోతున్నాడని అన్నారు. తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని తెలిపారు. మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోయే కంటే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడాలనే తాను నిర్ణయించుకున్నానని పవన్ చెప్పారు. మన జీవితాన్ని నిత్యం ప్రభావితం చేసే రాజకీయాలకు దూరంగా జరగొద్దని పవన్ పిలుపునిచ్చారు.
ప్రశ్నించే హక్కు కోల్పోవద్దు
‘పోరాడకపోతే.. మనల్ని వెన్నెముక లేని వారిలా మార్చేస్తారు. పోరాట స్ఫూర్తిని వీడొద్దు. రాజకీయాల్లో దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు రాజకీయాల్లో చురుగ్గా మారాలని కోరుకుంటున్నా. రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు. 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మధ్యతరగతి వర్గం పోరాడింది. మధ్యతరగతి ఎదగాలని ఆశిస్తున్నా. మన మాతృభూమికి వారి భాగస్వామ్యం అవసరం' అని పవన్ వ్యాఖ్యానించారు.