మరో కార్మికుడు ఆత్మహత్య: కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్, నకిలీ ఖాతాలపై జాగ్రత్తంటూ జనసేన
అమరావతి: ఇసుక కొరత కారణంగా మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలేపల్లి వెంకటేశ్ ఆత్మహత్య తన మనసును కలచి వేసిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా కార్మికులకు అండగా ఉండేందుకు ముందుకు రావాలన్నారు.
పవన్ కల్యాణ్, నారా లోకేష్ లకు గోల్డెన్ ఛాన్స్: అందుకుంటారా? వదులుకుంటారా?
ప్రభుత్వ అస్తవ్యస్థ విధానం వల్లే..
ప్రభుత్వానికి కార్మికుల బాధను తెలిసేలా అన్ని రాజకీయ పార్టీలు కలిసివచ్చి పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అస్తవ్యస్థ ఇసుక విధానం వల్ల కార్మికులు ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రాజకీయ పార్టీలకు పిలుపు
బీజేపీ, కమ్యూనిస్టులు ఈ సమస్యపై ఇప్పటికే స్పందిస్తున్నారు. ఇతర పార్టీలు కూడా కార్మికుల సమస్యలపై స్పందించాలని కోరుతున్నట్లు పవన్ చెప్పారు. 3.5 మిలియన్ల భవన కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న విశాఖలో భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
కార్మికులకు మద్దతుగా లాంగ్మార్చ్
భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి పడుతున్న బాధలను తెలియజేసేందుకు నవంబర్ 3న చేపడుతున్న లాంగ్ మార్చ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. 30వ తేదీన భవన నిర్మాణ కార్మికుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించాలని నాయకులకు, శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
ఛలో విశాఖ..
ఛలో విశాఖపట్నం కార్యక్రమ నిర్వహణకు సంబంధించి సోమవారం ఉదయం హైదరాబాద్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ నిర్ణయాలతో నెలకొన్న ఇసుక సంక్షోభం మూలంగా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితిని ప్రతి జిల్లా కేంద్రంలో ఎలుగెత్తి చాటాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ 31న జనసేన నేతలు జిల్లా కలెక్టర్కు ఈ సమస్యపై వినతి పత్రం అందించేందుకు, పార్టీ శ్రేణులు, కార్మికులతో కలిసి జిల్లా కేంద్రంలో ప్రదర్శనలు చేసేందుకు కార్యాచారణ రూపొందించారు. ఇసుక అందుబాటులో ఉంచకపోతే కార్మికులు, గృహ నిర్మాణదారులు ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలియజేసేలా ఉంటుందని జనసేన నేతలు చెప్పారు.
నకిలీ ఖాతాలతో జాగ్రత్తంటూ..
ఛలో విశాఖపట్నం కార్యక్రమం నిర్వహణఫై సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించారని, వాటి ద్వారా విరాళాలు సేకరిస్తున్న విషయంపై పార్టీ దృష్టికి వచ్చింది. ఇలాంటి ఖాతాలను ఎవరూ నమ్మవద్దని శ్రేణులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన మద్దతుదారులకు జనసేన సూచించింది.
మరో కార్మికుడు ఆత్మహత్య
ఇసుక కొరత మరో కార్మికుడ్ని బలితీసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన ప్లంబర్ పోలేపల్లి వెంకటేశ్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. బలవన్మరణానికి ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగుచూసింది. కార్మికుడి ఆత్మహత్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడి కుటుంబసభ్యులో ఆరోపిస్తున్నారు. ఇసుక కొరత కారణంగా ఉపాధిలేక ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు వెంకటేశ్ తన సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు.