నాపై బాబు, లోకేష్ల రూ.10కోట్ల కుట్ర, చనిపోవడమే మంచిది: పవన్ సంచలనం, మీడియాపైనా..
Recommended Video
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూనే మరోవైపు సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు.
గత కొన్ని రోజు లుగా జరుగుతున్న కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ.. చంద్రబాబు, ఆయన తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ల తీవ్రంగా మండిపడ్డారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటూ పలు మీడియా సంస్థలపైనా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ. 10కోట్లతో సచివాలయం వేదికగా నాపై కుట్రలు
ఆంధ్రప్రదేశ్ సచివాలయం వేదికగా తనపై ఆరు నెలలుగా కుట్ర జరుగుతోందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. రూ. 10కోట్లు ఖర్చు పెట్టి నారా లోకేష్ ఈ కుట్ర చేయించాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, అతని స్నేహితుడు రాజేష్ తనపై కుట్రలు చేసినట్లు పవన్ పేర్కొన్నారు.
తెరవెనుక కుట్రలు.. దీక్షకు పిలుపా?
తనపై బురద జల్లుతోంది చంద్రబాబు, లోకేష్లేనని పవన్ ఆరోపించారు. తెరవెనుక కుట్రలు చేస్తూ ఇప్పుడు దీక్షకు పిలుస్తారా? అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అసభ్యంగా తిట్టించి బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. తన తల్లిని కూడా రోడ్డుకీడిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారుకు అండగా నిలబడినందుకు తనకు దక్కిన గౌరవం ఇదేనని అన్నారు.
చనిపోవడమే మంచిది
తాను సినీ నటుడు, రాజకీయ పార్టీ నేత కాక ముందే ఓ తల్లికి కొడుకును అని పవన్ వ్యాఖ్యానించారు. తన తల్లి గౌరవం కాపాడలేని నాడు తాను బతికుండటం కంటే చనిపోవడం మంచిదని భావోద్వేగంగా పవన్ ట్వీట్ చేశారు.
బాధ్యత లేదా?
‘మీకు చదువులు ఉండి, విజ్ఞత ఉండి, కుటుంబాలు ఉండి, అక్కాచెల్లెళ్లు ఉండి, కోడళ్లు, కూతురులు ఉండి, పేరు ప్రఖ్యాతలు ఉండి, సంపదను కూడ పెట్టుకొని.. అన్నింటికీ మించి సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిల్లో మాధ్యమాల్లో ఉన్న మీరు అందరూ కలిసి.. ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళను, భర్త, పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్నతల్లిని.. ఎవరికి ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనల్లో కూడా చెయ్యని నాకు జన్మనిచ్చిన తల్లిని.. మీరందరు కలిసి నడి రోడ్డులో యే కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహాలు చెప్పి, అనిపించి, దానిని పదే పదే ప్రసారం చేసి, ఆ తర్వాత దానిపై డిబేట్లు చేసి స్థాయికి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారగలిగినప్పుడు.. కథువా బాలిక లాంటి ముక్కు పచ్చలారని పసిపిల్లలను, అభం శుభం తెలియని పసిపిల్లలపై దారుణమైన అత్యాచారాలు చేసే నీచులు నికృష్టులు ఎందుకు ఉండరు? కొల్లలుగా ఉంటారు..' అని మీడియాపై పవన్ తీవ్రంగా స్పందించారు. పవన్ తల్లిపై నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
బాలకృష్ణను అనగలరా?.. బాబూ ఆ పని చేస్తారా?
‘ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములు ..వారు చెప్పిందే వేదం ,వారి పాడిందే నాదం..' అని వ్యాఖ్యానించారు. మీడియా ఛానళ్ల చట్టబద్ధ వ్యభిచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కంటే కూడా మీడియాను బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చేయడం ముఖ్యమని పవన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి నీచపు మీడియాను నియంత్రించగలరా? అని పవన్ బాబును ప్రశ్నించారు. తనపై చేసినట్లే బాలకృష్ణపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేయగలరా? అని నిలదీశారు.
పవన్ అసహనం
‘మీరు అందరు కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా.. మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, మీ అక్క చెల్లెళ్లకు, మీ కూతురులకు, కోడళ్లకి మీ ఇంటిల్లిపాదికి నా హృదయపూర్వక వందనాలు' అని పవన్ వ్యాఖ్యానించారు.
భయపడతానా? వెనుకంజ వేస్తానా?
‘స్వశక్తితో జీవించేవాడు.. ఆత్మగౌరవంతో బతికేవాడు.. ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా? ఆత్మగౌరవంతో బతికేవాళ్లని, సంవత్సరాలుగా.. సంబంధం లేని వివాదాల్లోకి.. పదే పదే వీధిలోకి లాగిన తర్వాత పరువు పోతుందని భయపడతారా? అధికారంలో ఉన్నవాళ్లకి, మీడియాని చేతుల్లో పెట్టుకున్నవాళ్లకి, అర్థబలం ఉన్నవాళ్లకి.. వాళ్లు చేసే అత్యాచారాలకి.. స్వశక్తితో జీవించేవాడు.. ఆత్మగౌరవంతో బతికేవాడు.. ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే అసలు దేనికన్నా భయపడతాడా? వెనుకంజ వేస్తాడా?' అని పవన్ వ్యాఖ్యానించారు.
ఒక వేళ నేను చనిపోతే..
‘అందుకే.. నా ప్రియమైన అభిమానులకు, అక్క చెల్లెళ్లకు, ఆడపడుచులకు, జనసైనికులకు నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. ఈ రోజు నుంచి నేను ఏ క్షణంలోనైనా నేను చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళుతున్నాను, ఒక వేళా నేను ఈ పోరాటంలో చనిపోతే.. మీరు గుర్తుంచుకోవాల్సింది ‘నేను ఎంతో కొంత నిస్సహాయులకి అండగా.. అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ బద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు'' అని పవన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.