ఉద్యోగాల క్యాలెండర్ ఏది సీఎం జగన్: నిరుద్యోగుల సమస్యలపై పవన్ కళ్యాణ్ నిలదీత?
అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఉద్యోగాల క్యాలెండర్ ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. ప్రణాళిక లేని తీరు వల్లే నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని ధ్వజమెత్తారు.
గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణఫై పునరాలోచన చేయాలని పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుకు విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వస్తే చెప్పిన తేదీల్లో ఎలాంటి వివాదాలు, న్యాయపరమైన చిక్కులు లేకుండా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తారనే నమ్మకాన్ని యువత కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి సంవత్సరం జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ ఇస్తామని చెప్పిన ఏపీపీఎస్సీ.. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ముందడుగు వేయలేదని విమర్శించారు. గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు అయ్యిందన్నారు. ప్రిలిమ్స్ పరీక్షా పత్రంలో 51 తప్పులు వచ్చాయని, ఈ క్రమంలోనే నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
నిరుద్యోగుల అభ్యంతరాలను ఏపీపీఎస్సీ పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. డిసెంబర్ నెలలో మెయిన్స్ నిర్వహణకు కమిషన్ సిద్ధమైందని.. అదే సమయంలో ఇతర ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్య అర్హత పరీక్షలు ఉన్నందున గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణ తేదీలు మార్చాలని అభ్యర్థులు జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Recommended Video
ఓ ప్రణాళిక అంటూ లేకుండా వ్యవహరించడం వల్లే నిరుద్యోగులు నష్టపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు నిరుద్యోగ యువత సమస్యను మానవతా దృక్ఫథంతో పరిశీలించాలని పవన్ కళ్యాణ్ కోరారు.