పవన్ నోట టి నేత జిట్టా, జగన్లపేర్లు: తలకాయ తీసేలా
విశాఖ: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం విశాఖ జరిగిన సభలో తెలంగాణ ప్రాంత నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి పేరును, పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసును ప్రస్తావించారు. తన స్నేహితుడితో కలిసి రాసిన ఇజం పుస్తకాన్ని పవన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సమయంలో వారి పేర్లు ప్రస్తావించారు.
రాజకీయ నాయకులు కొందరు తాము పని చేయరు... ఇంకొకరిని చేయనివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి ఫ్లోరైడ్ సమస్య పైన పోరాడుతుంటే సహకారం లభించలేదని ఓ ఎన్ఆర్ఐ చెప్పారని పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ తన ప్రసంగంలో పరోక్షంగా జగన్ అక్రమాస్తుల కేసును ప్రస్తావించారు. సామాన్యుల మీద కేసులు పెడతారని, ఐదారు వేలు తీసుకున్న చిన్న స్థాయి ఉద్యోగులను ఎసిబి పట్టుకుంటుందని కానీ వేలకు వేల కోట్లు దోచుకున్న వారిని మాత్రం ఏమీ అనరని, తమకు గిట్టకపోతే మాత్రం సిబిఐని ప్రయోగిస్తారని, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ... బెయిల్ ఇచ్చేయొచ్చని అదే సిబిఐ చెబుతుందని విమర్శించారు.
అంటే... తమకు అనుకూలంగా ఉంటే ఒక చట్టం, వ్యతిరేకంగా ఉంటే మరో చట్టం... ఇదీ కాంగ్రెస్ తీరు అని దుయ్యబట్టారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో దర్యాప్తును పర్యవేక్షించిన లక్ష్మీనారాయణను బదిలీ చేసి, తొమ్మిది నెలలు పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా కూర్చోపెట్టిన వైనాన్ని గుర్తు చేశారు. చట్టం అందరికీ ఒకే విధంగా పని పని చేయాలని, పవన్ కల్యాణ్ తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టం కావాలని, అలాంటి చట్టాల కోసమే జనసేన పోరాడుతుందన్నారు.