అసెంబ్లీలో ఆ బిల్లులు వ్యతిరేకించండి .... రాపాకకు ఘాటు లేఖ రాసిన పవన్ కళ్యాణ్..
జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నేడు అసెంబ్లీలో మూడు రాజధానులకు మద్దతు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే . జనసేన ఎమ్మెల్యే రాపాక రాజధాని అమరావతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తో విబేధించిన ఆయన నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ జగన్ నిర్ణయానికి జై కొట్టనున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించటం జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం తెప్పించింది . ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్ కు ఘాటుగా బహిరంగ లేఖ రాశారు.
పవన్ కు షాక్ ఇస్తూ .. నేడు జగన్ నిర్ణయానికి మద్దతుగా ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక
ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు పవన్ కళ్యాణ్ ఘాటు లేఖ
జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మూడు రాజధానులపై ఈరోజు ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్న మూడు రాజధానులకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.ఇక దీనిపై పవన్ కళ్యాణ్ రాపాక తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు . ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు, అలా కాకుండా ప్రవర్తించటానికి వీలు లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అసెంబ్లీలో రాజధాని బిల్లులను వ్యతిరేకించాలని పేర్కొన్న పవన్
పవన్ కళ్యాణ్ పార్టీ రాజధాని అమరావతికే కట్టుబడి ఉందన్న విషయాన్ని నేడు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించాలని లేఖను రాసి రాపాకకు పంపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే.. ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ మరియు సమగ్రాభివృద్ధి కి సంబంధించి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి చేస్తున్న బిల్లులను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ రిజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని వ్యతిరేకించాలని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
పార్టీ నిర్ణయాల మేరకే నడుచుకోవాలని హితవు ..లేదంటే క్రమశిక్షణా చర్యలే
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని.. అదే సమయంలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అయితే పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు జనసేన సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తుంటే ఆయన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ కు మద్దతు ఇస్తానని చెప్పటంతో స్పందించిన పవన్ కళ్యాణ్ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని హితవు పలికారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. మరి రాపాక అధినేత మాట వింటారా లేదా అనేది ఈ రోజు తేలనుంది.